కేంద్ర ఎన్నికల పోలీస్ పరిశీలకుడు
రాజేశ్కుమార్
వరంగల్ అర్బన్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సమగ్ర సమాచారం సేకరించాలని కేంద్ర ఎన్నికల పోలీస్ పరిశీలకుడు రాజేశ్కుమార్ సూచించారు. మంగళవారం వరంగల్ (తూర్పు)–106 నియోజకవర్గ పరిధిలో గుర్తించబడిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తవాడలోని ఏకశిల స్కూల్, తుమ్మలకుంటలోని ప్రగతి స్కూల్, మండిబజార్లోని కిడ్డీ కూప్ స్కూల్, సుఫా స్కూల్, ఎల్లంబజార్లోని పూర్ణోదయ స్కూల్, ఖిలా వరంగల్ ప్రాంతంలోని ఆరెల్లి బుచ్చయ్య పాఠశాల, పెరకవాడలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ అబ్జర్వర్ పరిశీలించారు. అనంతరం పోలీస్ ఏసీపీ బోనాల కిషన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేస్తూ వరంగల్ (తూర్పు) నియోజకవర్గంలో మొత్తం 230 పోలింగ్ కేంద్రాల్లో 57 కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల పోలీస్ పరిశీలకులు రాజేశ్కుమార్ మాట్లాడుతూ.. ఆయా కేంద్రాల్లో అదనపు బలగాల మోహరింపుపై ప్రత్యేక కార్యాచరణ (ప్లాన్ ఆఫ్ యాక్షన్) ఉండాలన్నారు. ఈతనిఖీల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సురేశ్గౌడ్, పరిశీలకులు లైజన్ ఆఫీసర్ నిస్సార్ పాషా తదితరులు పాల్గొన్నారు.