ఓటరూ.. మేలుకో

- - Sakshi

ఆఫ్‌లైన్‌లో ఇలా...

18 ఏళ్లు నిండి ఓటరుగా మీకు అర్హత ఉంటే ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో)లకు మీరు నేరుగా ఫాం–6 దరఖాస్తులు అందజేయవచ్చు. మండల స్థాయిలో అయితే తహసీల్దార్‌ కార్యాలయాల్లో కొత్త ఓటరు కోసం పూర్తిచేసిన దరఖాస్తులను అందజేయొచ్చు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే మీ పేరును ఓటరు జాబితాలో చేరుస్తారు. ఓటు హక్కు ఎలా చేసుకోవాలి లేదా ఇంకేమైనా సందేహాలుంటే టోల్‌ ఫ్రీ నంబరు 1950కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

కొరిటెపాడు(గుంటూరు): సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు, ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఏప్రిల్‌ 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు.

ఆన్‌లైన్‌లో...

ముందుగా డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.ఎన్‌వీఎస్‌పీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ నంబరుతో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. న్యూ స్టేటస్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌ స్థాయి అధికారి మీ అడ్రస్‌కు వచ్చి మీ వివరాలను పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు. అలాగే హెచ్‌టీటీపీఎస్‌//ఓటరు పోర్టల్‌.ఈసీఐ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి. లాగిన్‌ అయ్యాక వెబ్‌సైట్‌లో న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లి వివరాలు పొందుపరిస్తే నిర్ధారించుకున్నాక మీ పేరు ఓటరు జాబితాలో చేరుస్తారు. మొబైల్‌లో ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటరుగా నమోదుకు

ఏప్రిల్‌ 15 తుది గడువు

Election 2024

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top