నిన్నమొన్నటి వరకూ వేసవిని తలపించేలా సూర్యుడి ప్రతాపం.. దీపావళి ఇలా వెళ్లి.. కార్తిక మాసం ఆరంభమైందో లేదో.. శరత్కాలం ఒక్కసారిగా హిమరాగాలు ఆలపిస్తోంది.. ఉషోదయాన పల్లెల్ని మంచుదుప్పటి కప్పేస్తోంది.. నేల రాలిన హిమ బిందువులు పచ్చి గడ్డి పరకల చివరన ముత్యాల సుమాలై విరబూస్తున్నాయి.. చేతికి అందివస్తున్న వరి చేలను... ఏపుగా పెరిగిన కొబ్బరి తోటలను మంచు ముట్టడిస్తోంది. అసలే ప్రకృతి అందాలతో చూపరులను కట్టి పడేసే కోనసీమ.. మంచు పరదాల మాటున మరిన్ని అందాలను అద్దుకుంటోంది. జిల్లాలోని అమలాపురం, మండపేట, రాజోలు వంటి ప్రాంతాల్లో 24 డిగ్రీల సెల్సియస్ వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ మంచు కురుస్తూండంతో ఉదయం, రాత్రి వేళల్లో చలి గిలిగింతలు పెడుతోంది.