ఇక మేమెలా బతకాలి తండ్రీ...
చౌడేపల్లె: ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదివి చరమాంకంలో తమకు అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో వారి దుఃఖానికి అంతేలేకుండా పోయింది. వివరాలిలా..ఢిల్లీలో మూడురోజుల కిందట మఽథురమండిచౌర ఆలయం ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె హైస్కూల్ వీధికి చెందిన పగడాల భవాని, రవి దంపతుల కుమారుడు హర్షల్ (21)తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. హర్షల్ ఢిల్లీలోని శాన్స్క్రిటీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్టీ కోర్సు చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో కోర్సు పూర్తి చేసి ఇంటికి వస్తానని చెప్పిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు. కోలుకుంటాడనుకున్న తరుణంలో వారికి విషాదమే మిగిలింది. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడు. అంతటి దుఖఃలోనూ ఆస్పత్రి వైద్యుల సలహామేరకు తమ కుమారుడి అవయవ దానానికి తల్లిదండ్రులు అంగీకరించారు. హర్షల్ ఇక లేడని తెలియడంలో స్థానికంగా చౌడేపల్లెలో ఉండే స్నేహితులు, సన్నిహితులు ఇంటివద్దకు చేరుకున్నారు. ఢిల్లీనుంచి మృతదేహం కోసం విషణ్ణ వదనంతో ఎదురుచూస్తున్నారు.
మద్యం మత్తులో తన్నుకున్న తమ్ముళ్లు
కుప్పం: మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆపై విరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. కుప్పంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్ అనుచరులు నలుగురు మద్యం మత్తులో అక్కడే ఉన్న హెచ్పీ రోడ్డుకు చెందిన టీడీపీ కార్యకర్త జగదీష్పై దాడి చేశారు. దీంతో గాయపడ్డ జగదీష్ తనపై శరత్, విజయకుమార్, బాలసుబ్రమణ్యం, చిరంజీవి దాడి చేశారని కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయాలతో కుప్పం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగదీష్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. కాగా జగదీష్ తమపై దాడి చేశాడని రాజ్కుమార్ అనుచరులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా.. వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్కు ముఖ్య అనుచరులు కావడం గమనార్హం.