జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల క్యాంపెయిన్ను శనివారం హోరెత్తించారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పోలింగ్ రోజు దగ్గరపడే కొద్దీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. అభ్యర్థుల కుటుంబీకులు కూడా మేము సైతం
అంటూ క్షేత్రస్థాయిలో ఓటర్లతో మమేకమవుతూ నీరాజనాలు అందుకున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యనలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ దూసుకుపోయారు. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారంలో కాస్త వెనకబడ్డారు. నాయకులకు.. కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకురాలేక
చివరి రోజు కూడా ముప్పుతిప్పలు పడ్డారు. సమన్వయలోపం.. నోటి దురుసుతో ప్రజల
నుంచి తిరస్కారాలు ఎదుర్కొన్నారు.
సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. శనివా రం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారాలను హోరెత్తించారు. ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు వెనకబడ్డారు.
సమరోత్సాహం : ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగాద నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యకర్తలు, అభిమానుల్లో సమరోత్సాహం నింపింది.
కుటుంబ సమేతంగా..
ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఓ వైపు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరో వైపు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరులో ప్రచారం చేశారు. రాజంపేట, చిత్తూరు ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రెడ్డెప్ప ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను నేరుగా కలిసి మద్దతు కూడగట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే.. నగరిలో మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి, సోదరులు, కుమారుడు, కుమార్తె ప్రచారం నిర్వహించారు. కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్జే భరత్, తల్లి పద్మజ, సోదరుడు శరత్, సతీమణి దుర్గపద్మిని విస్తృతంగా ప్రచారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ్, భార్య పావని గౌడ్ ప్రచారం చేశారు. పూతలపట్టులో అభ్యర్థి సునీల్కుమార్, కుమార్తె మోన మాన్విత, మేనళ్లళ్లు రాజేష్, ప్రవీణ్, రంజిత్, రాకేష్ ప్రచారం నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి, ఆయన సతీమణి ఇందుమతి ప్రచారం చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి, ఆమె తండ్రి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఊరూవాడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల విజయం కోసం వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా కలిసి కట్టుగా ప్రచారం నిర్వహించారు.
జిల్లాలో చివరి రోజు హోరాహోరీగా రాజకీయ పార్టీల క్యాంపెయిన్
ప్రజల్లోకి దూసుకుపోయిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
సకుటుంబ సపరివార సమేతంగా చేపట్టిన ప్రచారానికి నీరాజనాలు
కపట కూటమి నేతలకు అడుగడుగునా
తిరస్కారాలు