● పవన్కల్యాణ్పై బొడ్డేడ ప్రసాద్ విమర్శలు ● జగన్ దయ వల్లే చంద్రబాబుకు బెయిల్ ● కాపులు ఆత్మవిమర్స చేసుకోవాలని సూచన
నక్కపల్లి : బడుగు బలహీన వర్గాలు, యావత్ కాపు జాతి తమ అభిమాన నాయకుడిగా భావించే వంగవీటి మోహన్రంగాను హత్యచేయించిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ తనకు రరాజకీయంగా అడ్డు వస్తున్నాడని, ప్రజల్లో బలవంతుడవుతున్నాడన్న నెపంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పేదల సమస్యల కోసం శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను పథకం ప్రకారం హత్య చేయించాడన్నారు. అలాగే కాపుల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుటుంబ సభ్యులను విచక్షణా రహితంగా పోలీసులతో ఈడ్చుకుంటూ వెళ్లి జైల్లో పెట్టించారన్నారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తున్న చిరంజీవి తదితరులను అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబునాయుడు అన్నారు. కాపులకు చేసిన ద్రోహాన్ని, ముద్రగడకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయి కాపుల కోసం పాటుపడతానని చెప్పుకొనే పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కాపులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కళ్లు కనిపించడం లేదు, వళ్లంతా జబ్బులు వచ్చేసాయని ప్రాథేయ పడితే జగనన్న దయవల్ల చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్నారు. ప్రభుత్వ దయ వల్ల బెయిల్ వస్తే న్యాయం గెలిచిందంటూ టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈనెల 28న చంద్రబాబు తిరిగి జైలు కెళ్లాల్సిందేనన్నారు.