జిల్లా అధికారి ప్రసాదరావు
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నట్టు జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని కరిముఖిపుట్టు పంచాయతీ తాంగుల గ్రామంలో మలేరియా నివారణ మందు పిచికారీ పనులను పరిశీలించారు. పిచికారీకి సిద్ధం చేసిన మలేరియా నివారణ మందు మోతాదు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని గిరిజనులతో మాట్లాడారు. వీధుల్లో మురుగు, చెత్ల నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. ఇంటి బయట, లోపల మందును పిచికారీ చేయించుకోవాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దోమల నివారణ మందు తొలివిడత పిచికారీ చురుగ్గా జరుగుతోందన్నారు. మండలంలో 128 గ్రామాల్లో తొలివిడత పిచికారీ జరుగుతోందన్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శేషయ్య, మండల మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేశ్వరరావు, ఎంపీహెచ్ఈవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.