రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే
రంపచోడవరం: మారుమూల గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి స్క్రీనింగ్ కమిటీ తీర్మానాలతో కలెక్టర్కు ప్రతిపాదనలు పంపిస్తామని రంపచోడవరం పీవో సూరజ్ గనోరే తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో గురువారం డీఎఫ్వో నరేంథిరన్తో కలిసి ఆయన గిరిజన సంక్షేమశాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 25 రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులపై చర్చించారు. ఒక్కో రోడ్డు నిర్మాణానికి ఎంత అటవీ భూమి అవసరమవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లను పీవో ఆదేశించారు. అలాగే పర్యాటక ప్రాంతమైన గుడిసె రహదారి నిర్మాణానికి సర్వే చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి ముందుగా అటవీశాఖను సంప్రదించిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు. ప్రతిపాదించిన 25 రోడ్ల నిర్మాణానికి ఏమేర అటవీ భూమి అవసరమో అటవీశాఖ, ఇంజనీరింగ్శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు. రోడ్డు నిర్మాణాలతో పాటు ఎక్కడెక్కడ కల్వర్టులు నిర్మిస్తున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించారు. అడ్డతీగల సబ్ డీఎఫ్వో బి.రామారావు, టీడబ్ల్యూ ఈఈ జి.డేవిడ్రాజ్, డీఈలు చైతన్య, గౌతమి, నాగరాజు, రేంజర్లు ఎం కరుణాకర్, వి. దుర్గాకుమార్, ఎం అబ్బాయిదొర, ఎస్ఏ ఆజాద్ పాల్గొన్నారు.