-
అమ్మలకు వందనం
పటాన్చెరు టౌన్: మండల పరిధి ఇస్నాపూర్లో శనివారం నిర్వహించిన మదర్స్ డే వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులైన బిడ్డలకు సేవ చేస్తున్న 20 మంది మాతృమూర్తులను సన్మానించి చీరలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయమైనా అందించడానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ చంద్రకళ, డీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయురాలు సంతోషమ్మ, శిరీష, ఏపీఎం శ్రీనివాస్, సామాజిక కార్యకర్త బాపు వెంకన్న, కంచిగారి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హస్తం పార్టీతోనే సుస్థిర పాలన
నారాయణఖేడ్: కాంగ్రెస్ ద్వారానే సుస్థిర పాలన అందుతుందని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా పట్టణం నుంచి వివిధ గ్రామాల మీదుగా శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇచ్చిన మాటను నిలుపుకునే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సుధాకర్రెడ్డి, తాహేర్, రమేష్ చౌహన్, ముంతాజ్, సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
నారాయణఖేడ్: అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఖేడ్ మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆర్డీఓ అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు గాను 35 రూట్లుగా విభజించి 38 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. పోలింగ్ నిర్వాహణ కోసం 1,404 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇందులో పీవోలు 351 మంది, ఏపీవోలు 351 మంది, ఓపీవోలు 702 మంది ఉన్నారు. ఈనెల 12న ఉదయం నుంచి సిబ్బందికి సామగ్రి అప్పగించి కేంద్రాలకు తరలిస్తారు. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా కల్హేర్(నారాయణఖేడ్): వరి ధాన్యం కొనుగోలు చేయడంలేదని మండలంలోని మార్డిలో శనివారం రైతులు ధర్నా చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు, బడా రైతుల ధాన్యం మాత్రమే తూకం చేస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోం
హత్నూర(సంగారెడ్డి): రాజకీయ బిక్ష పెట్టి.. రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి లేదని రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి మంగాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్రెడ్డికి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం తగదన్నారు. కుటుంబ పాలన ఇప్పుడు గుర్తు కొచ్చిందా మదన్రెడ్డి అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఎంపీపీ నర్సింలు, దామోదర్ రెడ్డి, వీరేశం, శివశంకరరావు, శ్రీనివాస్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
సంగారెడ్డి టౌన్ : జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు తివారీ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యవేక్షణలో పూర్తి చేశారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ.. జుక్కల్ 255, కామారెడ్డి 266, ఎల్లారెడ్డి 270, బాన్సువాడ 258, అందోల్ 313, నారాయణఖేడ్ 298, జహీరాబాద్ 313 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ 2344మంది, సహాయ ప్రిసైడింగ్ 2344మంది, ఓపీఓలు 4688 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 1973 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు కేటాయింపులు జరిగాయని, డీఆర్సీ సెంటర్లలో ఆదివారం ఉదయం 7గంటలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. రిజర్వ్ పోలింగ్ సిబ్బంది కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజారాణి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పది నిమిషాలకో బస్సు
నారాయణఖేడ్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు సొంత గ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి ఈనెల 13 వరకు ఖేడ్, జహీరాబాద్లకు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ దైవాధీనం తెలిపారు. రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు శనివారం లింగంపల్లి పరిధిలోని బీహెచ్ఎల్ పాయింట్లో నారాయణఖేడ్, సంగారెడ్డి డీఎంలు మల్లేశయ్య, ఉపేందర్, ఖేడ్ పీఆర్వో పాండు, లింగంపల్లి పాయింట్ కంట్రోలర్ మొగులయ్యలతో కలిసి బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
కాంగ్రెస్ కదనోత్సాహం
పటాన్చెరు / పటాన్చెరు టౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి రోజు సీఎం రేవంత్రెడ్డి పటాన్చెరులో పర్యటించారు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం పట్టణంలో రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పటాన్చెరుకు విచ్చేసిన రేవంత్కు జనం నీరాజనం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్రోడ్ వద్ద సీఎంకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్లు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రోడ్షోలో రేవంత్ రెడ్డి 23 నిమిషాలు మాట్లాడారు. సీఎం ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ రెడ్డి నేతృతంలో బందోబస్తు చేపట్టారు. కాటాను ఎమ్మెల్యేగానే చూస్తాం.. : సీఎం రేవంత్సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాటాను గెలిపించి ఉంటే ఈ ప్రాంతంలో నిధుల వరద పారేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికై నా ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిస్తే చట్టసభల్లో ఈ ప్రాంత సమస్యను వివరించే అవకాశం ఉంటుందని రేవంత్ చెప్పారు. ఎంపీగా మధును గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానని రేవంత్ చెప్పారు. తన దృష్టిలో కాట శ్రీనివాస్ గౌడ్ కూడా ఎమ్మెల్యేనని రేవంత్ చమత్కరించారు. సంగారెడ్డి కింగ్ జగ్గన్న... జగ్గారెడ్డి సంగారెడ్డి కింగ్ అని సీఎం రేవంత్ సంబోధించారు. సీఎం ప్రసంగం కొనసాగుతుండగా జగ్గారెడ్డి వాహన టాప్పైకి ఎక్కారు. ఆ సందర్భంలో సంగారెడ్డి కింగ్ జగ్గారెడ్డి అంటూ సీఎం అనడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హోరెత్తారు. సీఎం కార్యాలయం అంతా జగ్గారెడ్డిదే నడుస్తుందని, తాను ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే, అక్కడ పెడుతున్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. పటాన్చెరులో సీఎం రేవంత్ రోడ్షో సక్సెస్ భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు -
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ప్రజల్లో మతపిచ్చి లేపి.. ప్రజలు కత్తులతో పొడుచుకుని, గొంతులు తెగి రక్తం చిందిస్తుంటే బీజేపీ అందులోంచి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ మాయలో పడి అధికారాన్ని కట్టబెడితే, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్షోలో సీఎం రేవంత్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దయితే బడుగు, బలహీన వర్గాలు ఐపీఎస్, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలుగా పదవులు పొందే అవకాశం లేకుండా పోతుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికన జరిగితే.. ఈ ఎన్నికలు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చాలనే ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, అమిత్షాలు ఏం తెచ్చారు? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వస్తే తెలంగాణకు నిధులు తెస్తారని తాము అనుకున్నామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, పటాన్చెరు వరకు మెట్రో పొడిగింపు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పరిశ్రమల కోసం నిధులు ఇస్తారని అనుకున్నామని, కానీ బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరుగుతుందని, కులాలు, మతాల పేరుతో కొట్లాడుకుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావని అన్నారు. కుర్చీ మీద కుర్చీ వేస్తారా? బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్ నిర్వాసితులను పోలీసుల బూట్లతో తొక్కించిన చరిత్ర ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్రావులకు రూ.వంద కోట్లు ఇచ్చినందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఎవరైనా కుర్చీ మీద.. కుర్చీ వేస్తారా అని ప్రశ్నించారు. పెగ్గు మీద పెగ్గు వేసినట్లు.. ఎమ్మెల్సీ ఉండగానే వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్టు ఇచ్చారని, పెగ్గులు వేసినప్పుడు టికెట్ ఇచ్చారో.. దిగేటప్పుడు ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్లో వందల ఎకరాల భూములు కబ్జా చేసి, ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓడితే ఆయన అక్రమంగా సంపాదించిన నాలుగైదు వందల కోట్లు పోతాయే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిర, వైఎస్ హయాంలోనే అభివృద్ధి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్ వంటి సంస్థలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వస్తే.. ఔటర్, శంషాబాద్ విమానాశ్రయం వంటి సంస్థలు దివంగత సీఎం వైఎస్ హయాంలో వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాల ప్రజలతో మినీ ఇండియాగా విలసిల్లుతోందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని, ఈ కేసును పర్యవేక్షిస్తున్నది మంత్రి దామోదర రాజనర్సింహ అని అన్నారు. -
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తాము గెలిస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఖతం చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు. దేశ పేదల గొంతుక, వారి గుండెచప్పుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు రాజ్యాంగంతోనే లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, మారుస్తామని అనడం ద్వారా బీజేపీ నేతలు పేద ప్రజలపైనే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్, మహాత్మాగాం«దీ, నెహ్రూ లాంటి వారు పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ రక్తం, చెమటను ధారపోశారు. ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని ఇప్పుడు బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాం«దీ, ఖర్గే, దేశ ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మాపుతామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభల్లో ఆయన మాట్లాడారు. మేం కోట్లాదిమందిని లక్షాధికారుల్ని చేస్తాం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల రిజర్వేషన్లను తొలగించేందుకే మోదీ సర్కారు పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు తొలగించాలంటున్న వారికి.. రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న వారికి మధ్య పోరు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల కోసమే అన్నీ చేశారు. దేశ ప్రజలు, రైతులు, శ్రామికుల కోసం కొద్దిగా కూడా పని చేయలేదు. మోదీ 22–25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు. బీజేపీ సర్కారు 22 మందిని కుబేరుల్ని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షలాధికారుల్ని చేస్తుంది. పేదల జాబితా తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాందీ, ఖర్గే, నేను, రేవంత్ రెడ్డి, తెలంగాణ నేతలందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారు చేస్తాం. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమ చేస్తుంది. నెలకు మరో రూ.8,500 వేస్తుంది. ఈ డబ్బులతో దేశంలోని పేద కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. విద్య, వైద్యం పొందుకోవడంతో పాటు పేదలు అనుకుంది ఏదైనా ఈ డబ్బులతో చేయగలుగుతారు. మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు నోరు విప్పని మీడియా, ఇప్పుడు మేము పేదలకు డబ్బులిస్తామంటే.. వారి అలవాట్లను చెడగొడుతున్నామని విమర్శిస్తోంది. అదానీ మనుషులూ.. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పేదల ఖాతాల్లో మేము రూ.కోట్లు వేయబోతున్నాం..’ అని రాహుల్ స్పష్టం చేశారు. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ‘దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము రైతుల కోసం జబర్దస్త్ పని చేయబోతున్నాం. మేనిఫెస్టోలో రెండు హామీలు పొందుపరిచాం. మా సర్కారు రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. వారికి చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తాం. రైతుల కష్టానికి తగిన ఫలితం లభించని రోజులు ఇక ఉండవు. పక్కాగా తొలి కొలువు మోదీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను తయారు చేశారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, అగ్నివీర్ పథకాల ద్వారా నిరుద్యోగ్యాన్ని పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిస్íÙప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసినవారందరికీ ఈ హక్కుఇవ్వబోతున్నాం. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. ఒక ఏడాది కాలం పక్కాగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. నెలకు రూ.8,500 వేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..’ అని రాహుల్ ప్రకటించారు. కులగణనతో రాజకీయాల్లో శాశ్వత మార్పు ‘నరేంద్ర మోదీ ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేశారు. మా ప్రభుత్వం పేద, బలహీన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ తరహాలో మేము దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని పేద, వెనుకబడిన, దళిత, గిరిజన, పేద ఉన్నత కులాలు, మైనారిటీలకు జనాభాలో వారి దామాషా తెలిసిపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఈ విప్లవాత్మక చట్టం అమల్లోకి వచ్చాక దేశ రాజకీయాలు శాశ్వతంగా మారిపోతాయి..’ అని ఏఐసీసీ నేత అన్నారు. రేవంత్ బృందం బాగా పనిచేశారు ‘రేవంత్, తెలంగాణ బృందం బాగా పనిచేశారు. 30 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తాం. మోదీ ఎంత డబ్బు కుబేరులకు ఇచ్చారో అంతే డబ్బును దేశ, తెలంగాణ పేదలకు ఇస్తాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. నేను తెలంగాణ ప్రజల కోసం ఢిలీల్లో సైనికుడిలా పనిచేస్తా. తెలంగాణకు ఏది అవసరమైనా ఆ పని చేసేందుకు నేను ఢిల్లీలో సిద్ధంగా ఉంటా..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, నేతలు మధుయాష్కీ, మహేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
జహీరాబాద్ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కిజర్యాఫై పాల్గొన్నారు.బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలుబీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్రెడ్డి, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
మెదక్లో ఎగిరేది గులాబీ జెండానే
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: బీజేపీ, కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నా మెదక్ పార్లమెంట్లో ఎగిరేది గులాబి జెండానేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలోని పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనపై పట్టు ఉన్న మంచి మనిషి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఏంటో దుబ్బాక ప్రజలకు అంతా తెలుసు అని.. అన్నారు. రఘునందన్రావును మరోసారి దుబ్బా క ప్రజలు చిత్తుగా ఓడించాలన్నారు. -
ఓటరు మదిలో ఏముందో?
● అర్థం కాక తలలు పట్టుకుంటున్న నాయకులు ● సుక్కా, ముక్కా లేకపాయే.. ● చేతులో జెండా.. ఆలోచనేమో పక్కకు రామచంద్రాపురం(పటాన్చెరు): లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో ఓటర్ల నాడీ తెలియక రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. నమ్ముకున్న కార్యకర్తలే తమ పార్టీని కాదని మరొకరికి ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది నాయకులు ఉన్నారు. పార్టీల కార్యకర్తలు ఒక దగ్గరికి చేరారంటే జెండాలను పక్కనపెట్టి అభ్యర్థుల గెలుపు, ఓటమిలపైనే చర్చించుకుంటున్నారు. బడా నేతలు సైతం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడీ పట్టుకునే ప్రయత్నంలో బిజీబిజీగా ఉంటున్నారు. కానీ వారికి ఓటర్ నాడీ దొరక్క ఒక తాటి మీదకి రాలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలకు భిన్నంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వైపే ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పైకి తాము ఈ పార్టీకే ఓటు వేస్తామని చెబుతున్నా లోపల మాత్రం మరొకటి ఉంటుందని స్థానికంగా చర్చించుకుటుంన్నారు. గత ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలకు సందడి కనిపించడంలేదు. గత ఎన్నికల్లో ఆది నుంచే మద్యం, డబ్బుల హవా నడిచేది. రాత్రి అయిందంటే ఎక్కడికి వెళ్లిన బిర్యానీ, మందు దావతులే కనిపించేవి. ప్రస్తుతం అవేమీ ఇక్కడ కనిపించడం లేదు. చాలామటుకు ఈ ఎన్నికల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని పలు పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. పై నుంచి రానిది తాము ఎక్కడి నుంచి తేవాలి అందుకే అందరం అభ్యర్థి కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నామని పలువురు నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటర్ నాడీని మాత్రం ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. -
పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డికాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మధు నర్సాపూర్ రూరల్: కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాగు, తాగు నీటితో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వెంకట్రామిరెడ్డిని గెలిపించి కేసీఆర్కు గిఫ్టు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబియా నాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింగరావు, చిన్న చింతకుంట మాజీ సర్పంచ్ సురేశ్ గౌడ్, పెద్ద చింతకుంట మాజీ సర్పంచ్ శివ కుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
No Headline
రాయపోలు(దుబ్బాక): పదేళ్ల బీజేపీ పాలనలో పే ద ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు దేశాన్ని దోచిపెట్టారని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు విమర్శించారు. బుధవారం రాయపోలు, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇక మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి పేదలకు తీరని అన్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. వారితోపాటు దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమం మాతోనే సాధ్యం
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డికేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి నారాయణఖేడ్: సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి శశికళ యాదవరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, ఎంపీటీసీ సబితా లింగారెడ్డి, రాధాకిషన్, శంకర్, పార్టీ మండ ల అధ్యక్షుడు తాహేర్, సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్ పాల్గొన్నారు. నిరుపేద కూలీలకు ఉపాధి కోసం కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి చట్టం చేసిందని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు వినోద్పాటిల్ తెలిపారు. కల్హేర్(నారాయణఖేడ్): ఎమ్మెల్యే డాక్టర్ పీ.సంజీవరెడ్డి బుధవారం సిర్గాపూర్, వాసర్, బీబీపేట, మార్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేశ్ షెట్కార్, అసెంబ్లీ ఇన్చార్జి శశికళ మాధవరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచయ్య, మనీశ్ పాటిల్, మాజీ ఆత్మ చైర్మన్ గుండు నరేందర్, నాయకులు దేవదాస్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ క్షణం నిఘా
● ప్రశాంత ఎన్నికలకు పోలీసుల చర్యలు ● 2,098 పోలింగ్ కేంద్రాల్లో 381 సీసీ కెమెరాలు మెదక్ కలెక్టరేట్: మెదక్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అని చర్యలు చేపడుతోంది. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటన జరిగినా క్షణాల్లో తెలిసేలా పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉన్నాయి. ఇందులో 18,28,210 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 2,098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మరో 26 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఆలోచనలో అధికారులు ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 381 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీక్షణం పరిశీలించనున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు కెమెరాలను బిగించి ఎప్పటికప్పుడూ అధికార యంత్రాంగం పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 349 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన కేంద్రాలు, 1770 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో 2 నుంచి 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాల ఏర్పాటు సంఖ్యను తగ్గించనున్నారు. ప్రత్యక్షంగా వీక్షణం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఎప్పటికప్పుడూ వీక్షించేలా సహాయ ఎన్నికల అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. సాధారణ, పోలీసు పరిశీలకులతో సహా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కంట్రోల్రూంలో అందుబాటులో ఉండి పోలింగ్ తీరును ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయ్యేలా, ఘర్షణలకు తావులేకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించేలా నిఘా కెమెరాల వ్యవస్థ పనిచేస్తుంది. -
కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ
పొలిటికల్ హీట్పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్నారాయణఖేడ్: కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. బుధవారం నారాయణఖేడ్లోని ఆయన నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఖేడ్ పట్టణానికి చెందిన దర్గా మజీద్ కమిటీ అధ్యక్షు డు హశం అలీ, నాయకులు లతీఫ్ సేట్, సలీం, అమేర్లతోపాటు వెంకటాపూర్, రాంతీర్థ్, నాగూరు(బి), పుల్కుర్తి, తడ్కల్ గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది చేరిన వారిలో ఉన్నారు. జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ అన్నారు. బుధవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సురేశ్ శెట్కార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేయనుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డీ తన్వీర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీల అమలును మరిచారు
చేర్యాల(సిద్దిపేట): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలును మర్చిన కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని వీరన్నపేట, ము స్త్యాల, రాంపూర్, ఆకునూర్, దొమ్మాట, గుర్జకుంట గ్రామాల్లో బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఆరు గ్యారంటీల అమలు విషయంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. చేర్యాల, జనగామ ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పినట్లుగానే పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడాలంటే మల్లేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరావు, నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య, అంకుగారి శ్రీధర్ రెడ్డి, ఎలికట్టె శివశంకర్, పెడతల ఎల్లారెడ్డి, గదరాజు చందు, వల్లూరి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
నీలంను భారీ మెజార్టీతో గెలిపించాలి
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావునిజాంపేట(మెదక్): కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నా రు. బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలం పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కమిటీ వేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధ రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మారుతీ, ముత్యంరెడ్డి, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, నసీరొద్దీన్, మహేందర్, వెంకటేశ్, లస్మాగౌడ్, క్రాంతి కిరణ్, రాహుల్ రెడ్డి, నర్సింహారెడ్డి, అజయ్, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎమ్మార్పీస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు పాపన్నపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం రాత్రి పాపన్నపేట కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 5 గ్యారంటీలు అమలు చేసిందన్నారు. -
కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ నర్సాపూర్: కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ కోరారు. బుధవారం ఓ ప్రైవేటు కాలేజీలో సీఐటీయూ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికలు–కార్మికుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం, వారి హక్కులపై దాడి పెరిగిందని, పోరాడి సాధించిన 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకు లు నాగరాజు, దాసు, నాగభూషణం, సురేశ్, పాల్గొన్నారు. సదస్సు అనంతరం పట్టణంలో నీలం మధుకు మద్దతుగా సీఐటీయూ, సీపీఎం నాయకులు ప్రచారం చేపట్టారు. రక్తంతో మంత్రి పొన్నం చిత్రపటం హుస్నాబాద్రూరల్: రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పుట్టిన రోజు పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నాయకుడు గట్టు సాయికృష్ణ గౌడ్ తన రక్తంతో చిత్ర పటం వేయించి బుధవారం బహూకరించాడు. 10 మిల్లీ లీటర్ల రక్తంతో చిత్ర పటానికి పెయింట్ వేయించి మంత్రి క్యాంపు కార్యాలయంలో అందించడంతో అందరూ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కు శ్రీనివాస్, వరప్రసాద్ పాల్గొన్నారు. సైబర్ వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రూ.3.99 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు పటాన్చెరు టౌన్: పార్ట్ టైమ్ జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డబ్బులు పోగొ ట్టుకున్న ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఏప్రిల్ 8వ తేదీన పార్ట్ టైమ్ జాబ్ అంటూ వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేయడంతో సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో బాధితుడు మొత్తం రూ. 3 లక్షల 99 వేలు చెల్లించాడు. ఉద్యోగి తా ను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా సైబర్ నేరగాళ్లు స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పరిశ్రమలో కార్మికుడు మృతి
హత్నూర (సంగారెడ్డి): పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు.. హత్నూర మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన నకచుంచు సత్యనారాయణ(42) కొన్నేళ్లుగా నస్తీపూర్ గ్రామ శివారులోని లోటస్ చాక్లెట్ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం జనరల్ షిఫ్ట్లో విధులకు హాజరయ్యాడు. పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సత్యనారాయణ కుప్పకూలిపోయాడు. వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసు కున్న కుటుంబీకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు చేరుకొని మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఎస్ఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినా వినలేదు. చివరగా పరిశ్రమ యాజమాన్యం మృతుడి కుటుంబానికి రూ.8 లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. -
ప్రతి పథకంలో కొండి.. తొండి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుండిగల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. ప్రతి పథకంలో కొండి పెట్టడం.. తొండి పెట్టడం.. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని అన్నారు. రైతుబంధు ఆర్థిక సాయం తాము అందరికీ ఇస్తే.. కాంగ్రెస్ వ్యవసాయం చేసిన వారికే ఇస్తామంటోందని చెప్పారు. వరి నాట్లు వేసేటప్పుడు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం.. కోతలు, కల్లాలైనా కూడా ఇవ్వడం లేదన్నారు. వడ్లు కొనడం లేదని, వడ్లకు బోనస్ బోగస్ అయిందని ఎద్దేవా చేశారు. రూ.రెండు లక్షల రుణమాఫీ జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, పటాన్చెరు, మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని దుండిగల్లో జరిగిన రోడ్ షోల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కింది ‘నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ ఉచితబస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లేదు. పేదల సంక్షేమం కాంగ్రెస్కు పట్టడం లేదు. రైతుబంధు సాయం అందలేదు. ఫ్రీబస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల నోళ్లు కొట్టారు. మేము మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ఇస్తే.. ఇప్పుడు ఆ నీళ్లు మాయమైపోయాయి. మా ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లు బ్రహా్మండంగా వచ్చిన కరెంట్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడికి పోయింది? ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇస్తలేరు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను నిలిపివేశారు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. రూ.4 వేల పింఛను ఇస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం హామీ నెరవేర్చామని రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగ సభలో అబద్ధాలు చెప్పారు..’అని కేసీఆర్ విమర్శించారు. ఏ వర్గాన్నీ పట్టించుకోవడం లేదు ‘టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, దానిపై సరైన, గట్టి వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల పోడు భూములకు కూడా రైతుబంధు ఆర్థిక సాయం అందించాం. కానీ ఇప్పుడు రావడం లేదు. నేను 58 ఏండ్లుగా మొత్తుకున్నా ఏ ఒక్క సీఎం కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను పంచాయతీలుగా చేసి నేరుగా నిధులు ఇచ్చాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ రాకుండా చేసింది. ఏ ఒక్క వర్గం కోసం కూడా కాంగ్రెస్ పని చేయడం లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోవడానికి ఆ పార్టీ విధానాలే కారణం. కాంగ్రెస్ విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు ఇక్కడి నుంచి తరలిపోతున్నరు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడని స్వయంగా మోదీయే ప్రకటించారు..’అని మాజీ సీఎం చెప్పారు. పాకిస్తాన్ పేరిట బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ‘పాకిస్తాన్తో పంచాయతీ అంటూ బీజేపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తోంది. ‘బుట్కంత దేశం పాకిస్తాన్.. జాడిచ్చి కొడితే 25 ఏండ్లు మన దిక్కు చూడదు.. ప్రతిసారి పాకిస్తాన్ అని చెప్పుడు.. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం.. ఓట్లు దండుకోవడం. ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. 150 స్లోగన్లు చెప్పిన మోదీ.. సబ్కా సాత్.. సబ్కా వికాస్ అయిందంటున్నరు.. అది కాలేదు కానీ.. దేశం సత్తెనాస్ అయింది.. మోదీ హయాంలో రూపాయి విలువ ఏ ప్రధాని హయాంలో దిగజారనంతగా పడిపోయింది. పెట్టుబడులు పోయాయి. అంతర్జాతీయంగా భారతదేశ విలువలు మంట గలిసిపోతున్నాయి. విశ్వ గురువుగా ప్రకటించుకున్న మోదీ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్టులపై అమెరికా దేశం సైతం తమ నిరసన తెలిపింది. మోదీ ఎజెండాలో పేదల బాధలుండవు. ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపిన మోదీ.. తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో క్షమాపణలు చెప్పిండు. మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండు? నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరిండని కేసీఆర్ ప్రశ్నించారు. పైసల కోసం చేరిండా? ఎవరిని ఉద్ధరించేందుకు ఆయన కాంగ్రెస్లో చేరిండో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మెదక్, మల్కాజిగిరి బీ ఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ది మూడో స్థానమే.. ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యువత, మేధావులు ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలే తప్ప.. ఒక ఒరవడిలో పిచ్చిపిచ్చిగా కొట్టుకుని పోవద్దు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్కు ఒటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిస్తే పార్లమెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. కృష్ణా, గోదావరి జలాలను తమిళనాడుకు తీసుకెళ్లే ప్రయత్నం మోదీ చేస్తు న్నారు. సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ నీళ్లను కాపాడు కోవాలంటే తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలి. అలా అయితే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుందని’ కేసీఆర్ పేర్కొన్నారు. -
మా పార్టీతోనే సంక్షేమం సాధ్యం
నారాయణఖేడ్: అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. ఖేడ్లోని ఆయన నివాసంలో సోమవారం నాగల్గిద్ద మండలం షాపూర్, మోర్గీ, మనూరు మండలం తిమ్మాపూర్, కంగ్జి మండలం, ముకుంద్ తండాలకు చెందిన దాదాపు 250 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, కంగ్జి మాజీ జెడ్పీటీసీ సర్ధార్, తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ అమలు జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ శెట్కార్ అన్నారు. సోమవారం మండలంలోని రంజోల్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ బాబు, బీఆర్ఎస్ నాయకులు బాబా, నర్సింహా, గుండ్రెడ్డి, చంద్రన్న, యూనూస్, నిజాం, సర్దార్, మస్తాన్, యూసూఫ్లను కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్, పార్టీ యువజన నియోజకవర్గం ఇన్చార్జి కె.నరేశ్ గౌడ్, పార్టీ నాయకులు వైజ్యనాథ్, ఖలీల్, మన్సూర్, షబ్బీర్, రవీందర్రెడ్డి, రాజు, శశి, మజార్, షౌకత్ పాల్గొన్నారు.కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ -
ధార్మికార్య వీరగల్లు విగ్రహం లభ్యం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గుర్తింపు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లిలో సోమవారం కొత్త తెలంగాణ బృందం యువ పరిశోధక సభ్యుడు శ్రీనివాస్ పర్యటించి ధార్మికకార్య వీరగల్లు విగ్రహం గుర్తించారు. వీరగల్లులో ప్రత్యేక వర్గానికి చెందిన వాడు ధార్మిక వీరగల్లుడని తెలిపారు. దేవక్కపల్లిలో గతంలో లభించిన శాసనం శక సంవత్సరం 993 విరోధికృత్ ఆషాఢ మాసం సూర్య గ్రహణం సందర్భంగా అనగా క్రీస్తు శకం 1071 జూన్ 30న దానం చేయుట గురించి చెక్కబడిందని వివరించారు. ఈ వీరుడి పేరున దానాలు చేసినట్లు భావించవచ్చన్నారు. వీరగల్లు వీరుడి ఆహార్య శైలి, నడినెత్తిన కొప్పు, ఎడమ చేతిలో లింగం కనిపిస్తుంది. మూడు అంతస్తులతో కనిపిస్తున్న కల్యాణి చాణిక్యుల కాలం నాటిదని తెలిపారు. యువతి అదృశ్యం న్యాల్కల్(జహీరాబాద్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని చినిగెపల్లిలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ రామానాయుడు కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సప్ప కుమార్తె కొటారి భాగ్య(28) గత నెల 30న కుటుంబ సభ్యులతో కలసి రాత్రి నిద్రించింది. కొద్దిసేపటికే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఆమె ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ ఉందన్నారు. తెలుగు, కన్నడ భాష మాట్లాడుతుందన్నారు. ఈ విషయంలో అదే గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వివాహిత.. చేగుంట(తూప్రాన్): వివాహిత అదృశ్యమైన ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన కోటగిరి నీలమణి(26)కి పాప, బాబు ఉన్నారు. ఈమె ఏప్రిల్ 28న తన పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పి వెల్దూర్తి మండలం రామాయిపల్లి గ్రామానికి వెళ్లింది. ఈ నెల 4న అనంతసాగర్కు వస్తున్నట్లు రామాయిపల్లి నుంచి బయలు దేరి అనంతసాగర్కు రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మంజీరాలో మునిగి బాలుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): మంజీరా నీటి మడుగులో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన కొండి భూమేశ్–యశోదకు ఇద్దరు కుమారులు. భూమేశ్ కుటుంబం ఖాళీ సీసాలు ఏరుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉద యం ఇంటి నుంచి ఖాళీ సీసాలు ఏరేందుకు భూమేశ్ భార్య, కుమారులతో ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధికి వచ్చారు. సీసాలు ఏరుతూ మధ్యాహ్నం సమయంలో ఎండ ఉక్కపోతగా ఉండడంతో నలుగురు కలిసి పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని మంజీరా నది మడుగులోకి దిగి స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు కొండి దుర్గేశ్ (16) స్నానం చేస్తూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లని రప్పించి దుర్గేశ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎండ ఉపశమనం కోసం స్నానానికి వెళ్లిన కుటుంబం ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement