రాజాపూర్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయి అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆందోళన చెందుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రా కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతులపై లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు.
ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల, నందారం, గుండేడ్ గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పత్తి, మొక్కజొన్న పంటలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, మాజీ ఎంపీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్.. రైతులు మణెమ్మ, లింబ్యానాయక్ను కలసి పంటల సాగు కోసం పెట్టుబడి ఎంత వరకు పెట్టారని అడిగి తెలుసుకున్నారు. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టామని, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అంటూ రైతులు వారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.