‘అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌ అంతే’ | Sakshi
Sakshi News home page

‘అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌ అంతే’

Published Wed, Jul 24 2019 6:47 PM

Asaduddin Owaisi Blamed Congress For Bringing The Unlawful Activities Prevention Act - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తీరును ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ బుధవారం లోక్‌సభలో ఎండగట్టారు. సవరణ బిల్లుపై సభలో జరిగిన చర్చ సందర్భంగా ఓవైసీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌ ముస్లింలకు పెద్దన్నయ్యలా వ్యవహరిస్తూ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కన్నా దారుణంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

ఈ చట్టానికి తానూ బాధితుడినని చెప్పిన ఓవైసీ కాంగ్రెస్‌ పార్టీకి తాను ఏం చేసిందీ తమ నేత నెలలకొద్దీ జైలులో గడిపితేనే తెలుస్తుందని విమర్శించారు. ఈ చట్టంతో బాధితులుగా మారిన వారికి తన ప్రసంగాన్ని అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఓవైసీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్‌ నేతలు ద్రోహులని మండిపడ్డారు. ఈ బిల్లు చట్ట నిబంధనలకు విరుద్ధమని అన్నారు. కేవలం అనుమానితులను కూడా ఆరు నెలల పాటు పోలీస్‌ కస్టడీలో ఉంచేలా ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం కింద బ్రిటన్‌లో 28 రోజలు, అమెరికాలో కేవలం రెండు రోజులే పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తున్నారని చెప్పారు.

Advertisement
Advertisement