మరీ అవసరమైతే తప్ప నొప్పి నివారణ మందులైన పెయిన్ కిల్లర్స్ వాడటం సరికాదని మరోమారు తాజాగా హెచ్చరిస్తోంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల మందులు వాడటానికి ఇది అధికారిక అనుమతి ఇచ్చే సంస్థ అన్న సంగతి తెలిసిందే.
గతంలో అంటే 2005లోనే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఈ హెచ్చరిక చేసినప్పటికీ... ఇది పూర్తిగా వాస్తవమని దాని తాజా అధ్యయనాల్లో మరోమారు నిరూపితమైంది. తప్పనిసరిగా నొప్పి నివారణ మందులను వాడాల్సిన పరిస్థితుల్లో వాటిని రెండు వారాలకు మించనివ్వవద్దని ఎఫ్డీఏ పేర్కొంది. వాటిని దీర్ఘకాలం వాడటం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ఉన్నవారు, బైపాస్ అయినవారు, ఒకసారి గుండెపోటు వచ్చినవారు నొప్పినివారణ మందులు తీసుకోవాల్సి వస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాకే వాడాలని ఎఫ్డీఏ సూచిస్తోంది.