మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అదిసాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
చిత్తూరు కలెక్టరేట్: ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో మన దేశానికి ప్రత్యేక స్థానం ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్న అధికారయంత్రాంగం సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. అందుకే ఓటును దుర్వినియోగం చేయకుండా దానికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఏటా జనవరి 25వ తేదీని జాతీయ ఓటరు దినోత్సవంగా పిలవడంతో పాటు ఘనంగా నిర్వహిస్తోంది.
యువత శాతం పెరుగుతున్నా..
జిల్లా జనాభా దామాషా ప్రకారం ఏటా యువత సుమారు 1.5 శాతం పెరుగుతోంది. జిల్లాలోని 41.70 లక్షల మేరకు ఉన్న జనాభాలో ఏటా యువత 60 వేల నుంచి 70 వేల మంది వరకు ఓటు హక్కు పొందే అవకాశం ఉన్నవారున్నారు. కానీ ఓటరుగా నమోదు చేసుకోవడంలో కనీసం 50 శాతం కూడా ముందుకురావడం లేదు. 2016–17 ఏడాదిలో దాదాపు 70 వేల మందికి గానూ 31,764 మంది ఓటరుగా నమోదు చేసుకోగా అందులో పురుషులు 18,901 మంది, మహిళలు 12,848 మంది, ఇతరులు 15 మంది మాత్రమే ఉన్నారు. 2017–18లో 29,827 మంది ఓటరుగా నమోదు కాగా అందులో పురుషులు 16,905 మంది, మహిళలు 12,916 మంది, ఇతరులు 6 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ రెండేళ్లకు గాను జిల్లావ్యాప్తంగా దాదాపు 1.10 లక్షల నుంచి 1.25 లక్షల మేరకు యువత ఓటరుగా నమోదు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 61,591 మంది మాత్రమే ఓటరుగా నమోదు కావడం గమనార్హం.
ఓటు విలువ తెలియజేయడానికే..
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటు విలువ తెలియజేయడానికే ఎన్నికల కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటుపై గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే..
ఓటరుగా నమోదు చేసుకునేందుకు విధిగా ప్రతి ఒక్కరు గుర్తింపు పత్రం (రేషన్కార్డు, విద్యుత్ బిల్లు, ఆధార్కార్డు, ఇంటి పన్ను రశీదు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు) తదితర వాటిల్లో ఏదైనా ఒకదానిని దరఖాస్తు ఫారానికి జతచేసి అందజేస్తే ఓటుహక్కు పొందవచ్చు.
♦ ఓటురుగా నమోదు చేసుకునేందుకు సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫారం–6 దరఖాస్తును ఉచితంగా పొందవచ్చు.
♦ ఓటరుగా నమోదు ప్రక్రియలో తప్పులను సరి చేసుకోవడానికి ఫారం–8 దరఖాస్తును పూర్తి చేసి ఇవ్వాలి. నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 (ఏ) దరఖాస్తును ఉపయోగించుకోవాలి.
♦ ఓటరుగా నమోదై ఫొటో మారిన పక్షంలో ఫారం–1 (డి) ద్వారా రెండు కలర్ ఫొటోలను అధికారులకు అందజేయాలి. వివరాల ఆధారంగా మార్పులు చేసుకునే సౌలభ్యం కలదు.
♦ ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం–7ను ఉపయోగించుకోవాలి. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్లోనూ ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది.ఠీఠీఠీ.ఛ్ఛి్చౌn ఛీజిట్చ.nజీఛి.జీn అనే వెబ్సైట్లో ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇందులో సమస్యలుంటే 08572–240899 నంబర్లో సంప్రదించాలి.