కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాయలసీమ ప్రాంతంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతంను ఉద్దేశపూర్వకంగానే ఎడారిగా మారుస్తున్నాయని వాపోయారు. నీటి ప్రాజెక్టులను, ఉక్కు పరిశ్రమను, రైల్వే మార్గాలను విస్మరించాయని ఆరోపించారు. ఆర్సీపీ సీనియర్ నాయకులు లింగమూర్తి , రాయలసీమ జిల్లాల ప్రతినిధులు మక్బూల్ బాషా, మడగలం ప్రసాద్, తస్లిమ్, లక్ష్మిదేవి, సుబ్బరాయుడు, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
మూల్యాంకన కేంద్రంలో
సౌకర్యాలు కల్పించాలి
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు మూల్యాంకన కేంద్రంలో సౌకర్యాలను కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్కుమార్, పాలెం మహేష్బాబు కోరారు. ఈ విషయమై బుధవారం డీఈఓ మర్రెడ్డి అనురాధను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదవ తరగతి మూల్యాంకన విధులు నిర్వహించే సిబ్బందికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. 58 సంవత్సరాల వయసు దాటిన ఉపాధ్యాయులకు, గర్భవతులు, చిన్న పిల్లల తల్లులకు, అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా మూల్యాంకన కేంద్రంలో తాగునీరు, మజ్జిగ సరఫరా చేయాలని కోరారు. అలాగే ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతోపాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున మూల్యాంకన కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే గత ఏడాది మూల్యాంకన విధులు నిర్వహించిన కొంతమంది ఉపాధ్యాయులకు ఇప్పటికి కూడా పూర్థిస్థాయిలో రెమ్యునేషన్ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా సీనియర్ నాయకులు చంద్రశేఖర్, సురేష్లతోపాటు ఒంటిమిట్ట, చికెదిన్నె మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.