● మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
తోటపల్లిగూడూరు: హత్యా రాజకీయాలతో ప్రజాక్షేత్రంలో ఎవరూ విజయం సాధించలేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజా బలంతో ఎన్నికలకు వెళ్తుంటే.. చంద్రబాబు ధనబలంతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీఎంను రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలకు చంద్రబాబు తెరలేపారని ధ్వజమెత్తారు. విజయవాడలో సీఎంపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని తెలిపారు. ప్రజాశీస్సులు, దేవుడి దయతో జగన్మోహన్రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. రానున్న ఎన్నికల్లో గెలుపొందాలనే దురుద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు మరోసారి గుప్పిస్తున్నారని విమర్శించారు. అనైతిక పొత్తుతో ముందుకొస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, నేతలు టంగుటూరు పద్మనాభరెడ్డి, కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, నెలవాయి ప్రకాష్రెడ్డి, టంగుటూరు సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.