మొయినాబాద్: కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కానిస్టేబుల్ మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కర్మన్ఘాట్ ప్రాంతానికి చెందిన కాటం రాజేష్ (30) సైదాబాద్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతని భార్య రెండేళ్ల క్రితం విడాకులిచ్చింది. ఆరోగ్యం బాగులేకపోవడంతో ఆరు నెలలుగా విధులకు సైతం వెళ్లడం లేదు. చాలా ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఈ నెల 22న మొయినాబాద్లోని స్టార్ కాలనీలో నివసించే అక్క సునీత ఇంటికి తల్లితో కలిసి వచ్చాడు. గురువారం అర్థరాత్రి వరకు ఇంట్లో అందరూ కలిసి ఆస్పత్రిలో చికిత్స గురించి మాట్లాడుకున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో రాజేష్ పడుకున్న గది తెరిచిచూసే సరికి ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.