● కోపంతో కుమార్తెను కొట్టి చంపిన తల్లి
● హోల్ది గ్రామంలో విషాదం
కొరాపుట్: పకోడి కోసం మారాం చేసిన కుమార్తెను తల్లి బలంగా కొట్టడంతో ఆ చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి హోల్ది గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లఖిరాం మజ్జి, త్రివేణి మజ్జిల కుమార్తె లఖిధర్ మజ్జి (9) చందాహండి సమితి ధర్మల్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చింది. తల్లి త్రివేణి తన ముగ్గురు పిల్లలకు పకోడి తెచ్చి ఇచ్చింది. అయితే లఖిధర్ తనకు ఎక్కువ పకోడి కావాలని మారాం చేసింది. దాంతో ఆగ్రహించిన తల్లి అక్కడే ఉన్న వెదురు కర్రతో లఖిధర్ తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు లఖిధర్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంటి వెనుక నాళాలో లఖిధర్ మృతదేహం పడేసి డీజిల్ వేసి దగ్ధం చేసింది. అనంతరం తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులను నమ్మించింది. విషయం తెలుసుకున్న రాయిఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. చిన్నారి ఆత్మహత్యపై అనుమానంతో దర్యాప్తు చేయగా జరిగిన విషయం త్రివేణి అంగీకరించింది. అనంతరం పోలీసులుత్రివేణిని అరెస్ట్ చేశారు.