పనులు వేగవంతం చేయాలి
రామడుగు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ హెచ్చరించారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో ఉపాధిహామీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను గురువారం పరిశీలించారు. మార్చి 31వరకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్డీవో పీడీ శ్రీధర్, గ్రామ ప్రత్యేకాధికారి భాస్కర్, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంపీవో రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
లైఫ్సైన్స్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు
కరీంనగర్సిటీ: ఎస్సారార్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడు తూ.. డాక్టర్లు దేవుళ్లన్నారు. కోవిడ్ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని ప్రశంసించారు. అలాంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సుల వైపు విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ ప్రియదర్శిని, గోవిందు,, జంతుశాస్త్ర విభాగాధిపతి పి.రాజు, కే.సురేందర్రెడ్డి, సురేష్ కుమార్, తిరుపతి, సుమలత తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజ్కుమార్
కరీంనగర్క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీవీ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడిగా తిరుకోవేల రఘువీర్, ప్రధాన కార్యదర్శిగా బేతి మహేందర్ రెడ్డి, కార్యదర్శిగా గుగులోతు భీమా ఎన్నికయ్యారు. లైబ్రరీ కార్యదర్శిగా కటకం రాజేందర్, మహిళా ప్రతినిధిగా డి.రేణుకను ఎన్నుకున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కందుల అరుణ్కుమార్, సుంకే దేవకిషన్, మాతంగి రవీందర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పాస్తం ఆంజనేయులు, కొండ్ర లక్ష్మణ్, బెజ్జంకి శ్రీకాంత్, ట్రెజరర్గా రామగిరి శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మడిపల్లి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కాసుగంటి మాధవ రావు వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, సుడా మాజీ చైర్మన్ జీవీ రామ కృష్ణారావు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పదో తరగతి పరీక్షల్లో ఒకరు డిబార్
కరీంనగర్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం సామాన్యశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈవో సీహెచ్ జనార్దన్రావు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 12,565మందికి 12,551మంది హాజరుకాగా 14మంది గైర్హాజరు అయ్యారని, ప్రైవేట్ విద్యార్థులు 92 మందికి గానూ 66మంది హాజరు కాగా 26మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు 16 పరీక్ష కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి ఒక పరీక్ష కేంద్రాన్ని మొత్తం 17 కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. దుర్శెడ్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థిని మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు వివరించారు.
ల్యాబ్ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు
కరీంనగర్టౌన్: జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్లో మద్యం సేవించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్లు సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఈనెల 19న ‘ఎంసీహెచ్ ల్యాబ్లో మద్యం కలకలం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్ స్పందించారు. ఎన్హెచ్ఎం కింద విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వోకు, మరో ముగ్గురు విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చే యాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కు సూచించినట్లు పేర్కొన్నారు.