అధ్యాపకులూ నిత్యవిద్యార్థులే
రాజానగరం: సాంకేతిక విజ్ఞానానికి అవసరమైన వివిధ అంశాలపై అవగాహన కల్పించడం కోసం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. మూడ్ల్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ గ్లోబల్ రికగ్నేషన్పై బుధవారం ఫ్యాకల్టీ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో నిత్య విద్యార్థులేనన్నారు. రీసోర్స్పర్సన్, జేఎన్టీయూకే మ్యాథమెటిక్స్ హెచ్ఓడీ వి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ మూడ్ల్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా ఆన్లైన్ టీచింగ్ పద్ధతులను మెరుగుపర్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
జాతీయ చెస్ పోటీలకు సాత్విక్
అమలాపురం టౌన్: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈనెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకూ జరిగే జాతీయ చెస్ పోటీల్లో పాల్గొనేందుకు అమలాపురం విక్టరీ అకాడమీ విద్యార్థి ద్రాక్షారపు సాత్విక్ బుధవారం బయలుదేరి వెళ్లాడు. గత జనవరిలో విజయ నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో సాత్విక్ సత్తా చాటి, జాతీయ టీమ్ చెస్ చాంపియన్ షిప్నకు ఎంపికయ్యాడని అకాడమీ ప్రిన్సిపాల్ తాడి వెంకట సురేష్ తెలిపారు. సాత్విక్ వివిధ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో తొమ్మిది సార్లు పాల్గొన్నాడు.
శతాధిక వృద్ధురాలి మృతి
అల్లవరం: మండలంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దాకారపు సీతమ్మ (102) బుధవారం మృతి చెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీతమ్మకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని పలువురు సందర్శించి, నివాళులర్పించారు.