తిరుపతి, సాక్షి: ఒకటో తేదీన ఇళ్లకే చేరాల్సిన ఫించన్.. చంద్రబాబు అండ్ కో కుట్రల కారణంగా నిలిచిపోయింది. పెన్షనర్లు.. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఎండలో స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పాత పరిస్థితుల్ని కళ్లారా చూస్తున్నాం. బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ఈ పరిస్థితులపై విచారం వ్యక్తం చేస్తున్నది తెలిసిందే.
తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద ఎనిమిదో రోజు బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ కొందరు అక్కాచెల్లెమ్మలతో, అవ్వలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అవ్వను దగ్గరకు పిలిపించుకుని మరీ పెన్షన్ కోసం ఆరా తీశారు. కొందరి వల్లే అలా జరిగిందని ఆమెకు వివరించే యత్నం చేశారాయన. అలాగే.. మళ్లీ మన ప్రభుత్వమే రావాలని.. అలా అయితేనే పెన్షన్లు ఇంటికే వస్తాయని.. దేవుడ్ని మొక్కుకోమని ఆ అవ్వను సీఎం జగన్ కోరారు. అలాగే వేరుశనగ పంటను పరిశీలించి.. వాళ్లిచ్చిన కాయల్ని తిన్నారాయన.
మరోవైపు మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టేందుకు దారి పొడవునా జనాలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పేడు శివారులో చెప్పులు లేకుండా ఎండలో రోడ్డు మీద తన ప్రచార రథం వెంట పరిగెడుతూ వస్తున్న ఓ వ్యక్తిని చూసి సీఎం జగన్ తన బస్సును ఆపించారు. ఎందుకలా చెప్పుల్లేకుండా వస్తున్నావ్ అని సీఎం జగన్ ఆరా తీయగా.. తాను మీ అభిమానినని(సీఎం జగన్ను ఉద్దేశించి..), పరిగెత్తుకొచ్చే క్రమంలో చెప్పులు తెగిపోయాయని ఆ వ్యక్తి సమాధానం చెప్పడంతో అంతా నవ్వులు చిందించారు. ఆ వ్యక్తిని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి సెల్ఫీ దిగి మరీ పంపించారు సీఎం జగన్.