వైఎస్ఆర్సీపీలోకి బొత్స సత్యనారాయణ | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలోకి బొత్స సత్యనారాయణ

Published Sat, Jun 6 2015 2:36 PM

వైఎస్ఆర్సీపీలోకి బొత్స సత్యనారాయణ - Sakshi

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచక్చుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8.15 గంటలకు ఆయన పార్టీలో చేరుతారు. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్రాంతంలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ పంపిన రెండు రోజుల తర్వాత ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లొచ్చని ఊహాగానాలు వచ్చినా.. ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎంచుకున్నారు.

విజయనగరం జిల్లాలోను, ఉత్తరాంధ్ర ప్రాంతంలోను పార్టీకి గట్టి నాయకుడిగా.. ఏ అంశం మీదైనా తనదైన శైలిలో అనర్గళంగా వివరించగల వక్తగా బొత్స సత్యనారాయణ పేరొందారు. ఆయన భార్య బొత్స ఝాన్సీలక్ష్మి కూడా ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు. తొలుత బొబ్బిలి, తర్వాత విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాలకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో  చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేశారు.

Advertisement
Advertisement