ప్రాణంతీసిన ‘సదరం' | Sakshi
Sakshi News home page

ప్రాణంతీసిన ‘సదరం'

Published Thu, Oct 16 2014 3:38 AM

ప్రాణంతీసిన ‘సదరం'

వనపర్తి: పింఛన్ అర్హత పరీక్ష  కోసం వచ్చి ఓ వృద్ధుడు ప్రాణం తీసుకున్నాడు. వికలత్వ ధ్రువీకరణపత్రం పొందేందుకు వైద్యపరీక్షల కోసం నిర్వహించిన సదరమ్ క్యాంపులో జరిగిన తోపులాటలో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వికలాంగులంతా చలిం చిపోయారు. ఈ విషాదకర సంఘటన బుధవారం వనపర్తి ఏరియా ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకుంది. ఖిల్లాఘనపురం మండలం బలిజపల్లి పంచాయతీ జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి(70) మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాడు.

పింఛన్ కోసం విలకత్వ ధ్రువీకరణపత్రం పొందేందుకు తన భార్య లోకమాతతో కలిసి బుధవారం ఉదయం 9 గంటలకే వనపర్తి ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు వచ్చాడు. వైద్యపరీక్షల కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే  వరుసలో నిల్చున్నాడు. మరో ఇద్దరి తరువాత డాక్టర్‌ను కలవాల్సిన సమయంలో ఒక్కసారిగా తోపులాట మొదలైంది.

దీంతో భయాందోళనకు గురైన నర్సింహారెడ్డికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న అతని భార్య మరో సహాయకుడు వైద్యులుకు విషయం చెప్పడంతో వారు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న నర్సింహారెడ్డి గ్రామంలో సొంతంగా వ్యవసాయం చేసుకునే జీవనం సాగించేవాడు. మృతునికి కొడుకు, కూతురు ఉంది.

 ప్రతిపక్షాల ఆందోళన
 రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల బలహీనతలను ఆసరా చేసుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతుందని వనపర్తిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. వనపర్తి ఏరియా ఆస్పత్రి ఎదుట వీరు రోడ్డుపై బైఠాయించారు. శవాన్ని రోడ్డుపైకి తేవాలని ప్రయత్నించడంతో బాధిత కుటుంబసభ్యులు ఇందుకు ఒప్పుకోలేదు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వనపర్తి ఆర్డీఓ రాంచందర్ హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 టీఆర్‌ఎస్ నేత నిరంజన్‌రెడ్డి ఆర్థికసాయం
 వనపర్తి ఏరియా ఆస్పత్రిలో గుండెపోటు తో మృతిచెందిన నర్సింహారెడ్డి కుంటుం బాన్ని ఆదుకునేందుకు తాను వ్యక్తిగతం గా రూ.50వేల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు డు ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. జరిగిన సంఘటన అత్యంత దురదుష్టకరమైందన్నారు. బాధితకుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.

సదరం, వికలత్వ ధ్రువీకరణపత్రం, అర్హత పరీక్ష  

 

Advertisement
Advertisement