కుప్పం: నియోజకవర్గంలో బుధవారం జరిగే రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనకు జనం వెళ్లరాదని తెలుగుదేశం నాయకులు బెదిరింపులకు తెరతీశారు. పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని కొందరు వైఎస్సార్సీపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు పూనుకున్నారు. తమకు అనుమానం వచ్చిన వ్యక్తులతో ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ వైపు వెళ్లకూడదని, వెళితే అధికారంలో ఉన్న తాము మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో కుప్పం ప్రాంతంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా గుడుపల్లె మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కార్యక్రమాలు అధికంగా ఉండటంతో టీడీపీ నాయకులు ఓ ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి ఆ పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పెద్దిరెడ్డి పర్యటించే ప్రాంతాలకు జనం వెళ్లకుండా యువత కమిటీల పేరిట అడ్డుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా కార్యకర్తలను పట్టించుకోకపోగా.. ఇప్పుడు తాము గుర్తొచ్చామా ? అంటూ టీడీపీపై మండిపడుతున్నారు. తాము పార్టీ మారడం లేదని చెబుతున్నా వినకుండా ఓ ఇద్దరు ప్రధాన నేతలు ఫోన్ల ద్వారా హెచ్చరించడంతో స్థానికులు తీవ్ర మనస్థాపానికి... భయాందోళనకు లోనవుతున్నారు. కొన్ని గ్రామాల్లో అనుమానాలు ఉన్న వ్యక్తులను బుధవారం ఊరు వదలి వెళ్లాలని మరీ బెదిరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.