Sakshi News home page

అసలు పొమ్మని సాగనంపుతున్నది మా బాబే...!

Published Sun, Feb 14 2016 6:18 AM

అసలు పొమ్మని సాగనంపుతున్నది మా బాబే...! - Sakshi

రాష్ర్ట రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, వరసగా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరి గులాబీ కండువా కప్పుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపార్టీ నాయకుల పోరు, మిత్రపక్షం బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకే చంద్రబాబు ప్రచారానికి వచ్చారని టీడీపీనాయకులే అంటున్నారు. అందువల్లే నిజాంకాలేజీ లో జరిగిన ప్రచారసభలో నిస్సారంగా, ఏమాత్రం ఉత్తేజపూరిత ప్రసంగాన్ని చంద్రబాబు చేయలేకపోయారని ఇప్పుడు ఆ పార్టీ నాయకులు సూత్రీకరిస్తున్నారు. గ్రేటర్‌ఎన్నికల పరిస్థితి ఏమిటంటూ చంద్రబాబు వద్దే కొందరు నాయకులు ఆరాతీసే ప్రయత్నం చేశారు.

అయితే దీనిపై ఆయన స్పందించిన తీరు వారినే ఆశ్చర్యపరిచిందట. నేను ఏపీలో ఉంటాను. అక్కడి రాజకీయాలు తెలుసు. మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు. ఇక్కడి పరిస్థితులు మీకే తెలియాలి అంటూ జవాబివ్వడంతో అవాక్కాయ్యారట. దీనితో ఇక టీడీపీకి మనుగడ లేదని మనదారి మనం చూసుకోవాల్సిందేనని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు డిసైడై పోయారట. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు రాజీపడిపోయారని, ఇక తెలంగాణలో పార్టీని నడపడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చారని టీడీపీనాయకులే అంతర్గత చర్చల్లో చెవులు కొరుక్కుంటున్నారట. అంతేకాదు అసలు టీఆర్‌ఎస్‌లోకి పార్టీ ఎమ్మెల్యేలను, ఇతరనాయకులను వెళ్లమని పరోక్షంగా సాగనంపుతున్నది కూడా మా బాబే నంటూ ఆ పార్టీ ముఖ్యనాయకులే గుసగుసలు పోతున్నారట. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పక్కనున్న వారు కూడా ఎవరూ మిగలరని, ఆయన కూడా ఒంటరై పోయి ఏ కాంగ్రెస్‌పార్టీలోనో చేరతారంటూ కూడా వారు సూత్రీకరణలు చేస్తున్నారట...!

Advertisement

What’s your opinion

Advertisement