‘‘వెధవ గోల... రాత్రీ లేదు పగలూ లేదు. పండగా లేదు పబ్బం లేదు. ఎప్పుడు చూసినా డ్యూటీయే’’... తిట్టుకుంటూ నడుస్తున్నాడు కాని స్టేబుల్ కణ్నన్. రెండు వారాలుగా సెలవు కూడా లేకుండా పని చేస్తున్నాడేమో... పరమ విసుగ్గా ఉందతనికి. ‘‘పోనీ ఇంత కష్టపడి నందుకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే అదీ లేదు. ఎగిరి తన్నినా అంతే, ఎగరకుండా తన్నినా అంతే అన్నట్టుగా ఉందీ బతు...’’మాట పూర్తి చేయకుండా చప్పున ఆగిపోయాడు కణ్నన్. అకస్మాత్తుగా వచ్చి ఎదురుగా నిలబడిన పాపని విస్తుపోయి చూశాడు. పాప స్కూల్ యూనిఫామ్లో ఉంది. బాగా రొప్పు తోంది. కళ్ల నిండా భయం. నిలువునా వణికిపోతోంది. ‘‘ఏంటమ్మా? ఎందు కలా భయపడుతున్నావ్? ఏమయ్యింది?’’ అన్నాడు పాప తల నిమురుతూ.
‘‘మరే... అంకుల్... ఓ ఆటో డ్రైవర్ నన్ను ఎత్తుకుపోవాలని చూశాడు’’ అంది తడబడుతూ, ఆగి ఆగి చెబుతూ.‘‘అవునా? ఎవరు? అతను నీకు తెలుసా?’’ అడిగాడు. తల అడ్డంగా ఊపింది. ‘‘తెలీదంకుల్. నేను ట్యూషన్ నుంచి వస్తుంటే వైన్ షాపు ముందు ఓ ఆటో ఆగివుంది. డ్రైవర్ నన్ను పిలిచి, ఆటో ఎక్కితే ఇంటి దగ్గర దింపుతానన్నాడు. నేను వద్దంటే బలవంతంగా ఎక్కించబోయాడు. తప్పించుకుని వచ్చేశాను.’’పాప మాట వినగానే అటువైపు పరుగెత్తాడు కణ్నన్. కానీ అక్కడ ఆటో లేదు. అతని మనసులో ఏదో మెదిలినట్టయ్యింది. హుటాహుటిన స్టేషన్కి బయలుదేరాడు.
‘‘అంటే ఇన్ని నేరాలకూ కారణం ఓ ఆటోడ్రైవర్ అంటావా?’’... కణ్నన్ ముఖంలోకి చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. అవునన్నట్టు తలూపాడు కణ్నన్. ‘‘అతనే హంతకుడని అనడం లేదు సర్. అతను కూడా అయి ఉండొచ్చేమో అంటున్నాను. ఇన్నాళ్లూ మనం చాలా యాంగిల్స్లో ఆలోచించాం. ఫలితం లేదు కదా! ఇప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించి చూద్దాం’’ అన్నాడు తడబడకుండా. ఆలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్. నిజమే. రెండేళ్లు... తొమ్మిది మిస్సింగ్ కేసులు... చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఏ ఒక్కరి జాడా తెలియలేదు.
ఎన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేసినా కేసులో ముడి వీడటం లేదు. కణ్నన్ చెప్పినట్టు చేస్తే? అదే కరెక్టనిపించింది ఇన్స్పెక్టర్కి. వెంటనే మద్రాసులోని ఆటోడ్రైవర్లందరి మీదా కన్నేసి ఉంచమని తన టీమ్ని ఆదేశించాడు. ప్రతి ఆటో డ్రైవర్నీ పరిశీలించాలంటూ తమిళనాడులోని మిగతా స్టేషన్లన్నింటికీ మెసేజ్ పంపాడు. కణ్నన్ ఆలోచన, ఇన్స్పెక్టర్ ఆచరణ వృథా పోలేదు. పల్లవరం ప్రాంతంలో ఓ యువతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో ఖాకీల చేతికి చిక్కాడు శంకర్. ద సెన్సేషనల్ అండ్ నటోరియస్ కిల్లర్... గౌరీ శంకర్. విచారణలో శంకర్ చెప్పిన విషయాలు విని పోలీసులకు సైతం చెమటలు పట్టాయి. వెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన శంకర్, జీవనోపాధిని వెతుక్కుంటూ మద్రాసు వచ్చాడు. ఆటో నడపడం మొదలు పెట్టాడు. దానితో పాటు అక్రమంగా మద్యం తరలించేవాడు.
ఓసారి అనుకోకుండా ఒంటరిగా కంటపడిన లలిత అనే అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆధారాలు దొరక్కూడదని ఆమెను చంపేసి, పెట్రోల్ పోసి కాల్చేశాడు. మిగిలిన అవశేషాలను తీసుకెళ్లి సముద్రంలో కలిసేశాడు. అప్పట్నుంచి అతనిలో రాక్షసత్వం పురివిప్పింది. రెండేళ్లలో వరుసగా మరో ఎనిమిది మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్లి, మానభంగం చేసి, అదే పద్ధతిలో చంపేశాడు. ఈ మారణకాండలో అతడి తమ్ముడు మోహన్, బావమరిది ఎల్దీన్, స్నేహితులు శివాజీ, జయవేలు, రాజారామన్, రవి, పళని కూడా సహకరించారు. చివరికి శుభలక్ష్మి అనే పాప కిడ్నాప్కి చేసిన విఫలయత్నం వారిని పట్టించింది.
‘‘ఇదంతా ఎందుకు చేశావ్?’’... అడిగాడు ఇన్స్పెక్టర్.
పగలబడి నవ్వాడు శంకర్. ‘‘ఇవన్నీ సినిమాల్లో చూసినప్పుడు చాలా కిక్కిచ్చేవి సర్. నన్నూ అలా చేయమని మనసు పోరు పెట్టేది. అందుకే చేశాను.’’అతని సమాధానం, అతడిలోని రాక్షసత్వం ఇన్స్పెక్టర్నే కాదు, యావత్ దేశాన్నీ అవాక్కయ్యాలే చేశాయి. న్యాయ స్థానం శంకర్ని క్షమించడానికి నిరాకరించింది. ఉరి తీయమంటూ ఆదేశించింది. ఏప్రిల్ 27, 1995న ఆ నలయ్యొక్కేళ్ల రాక్షసుడు, సేలం సెంట్రల్ జైల్లో ఉరికొయ్యకు వేళ్లాడాడు. అతడికి సహకరించిన వారందరికీ జీవిత ఖైదులు పడ్డాయి. దాంతో దేశాన్ని వణికించిన కొన్ని మానవ మృగాల రాక్షసకాండకు శాశ్వతంగా తెరపడింది!
Related news
-
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్ను సేఫ్గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్ని ఆపరేషన్తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్ని సెర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్ని టైట్గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్క్లేజ్కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్ రైట్స్ ఇండెక్స్) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్ రైట్స్ ఇండెక్స్–2022 జాబితా ప్రకారం...వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్ఓ ఏటా లేబర్ రైట్స్ ఇండెక్స్ను రూపొందిస్తుంది.ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.‘కోవిడ్’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..‘కోవిడ్’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్డౌన్ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్’ పరిస్థితులు చక్కబడటంతో లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.కనీస వేతనాలకూ కరవు..ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.‘కోవిడ్’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్ వేజెస్) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.ఉదాహరణకు బిహార్లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్ఓ జీవన వేతనంగా నిర్వచించింది.జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు, నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్ నిపుణులను ఇజ్రాయెల్కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కార్మిక మంత్రి భారత్ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు. -
Ashish Chanchlani: టాలెంట్తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్కి వెల్నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే..
Related News by category
-
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్లో.. భవిష్యత్లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్ని, షేప్ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్స్టార్ హోటల్ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement