నల్లగొండ: 2009 ఎన్నికల్లో వైఎస్సార్ దయతోనే టికెట్ పొంది గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఆయనపై విమర్శలకు దిగడంపై వైఎస్సార్ సీపీ నేత షర్మిల మండిపడ్డారు. ఆ రోజు వైఎస్సార్ ప్రచారం చేస్తేనే గెలిచిన సంగతిని మరచిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని కోదాడ సభకు హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన ఆమె.. వైఎస్సార్ మరణంతో ఎక్కువ మంది చనిపోయింది తెలంగాణ ప్రాంతంలోనేనని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణాలో అరవై శాతం మంది ప్రజల గుండెల్లో వైఎస్.రాజశేఖర్రెడ్డి బతికే ఉన్నాడని షర్మిల తెలిపారు. వైఎస్ను దేవునిలా కొలుస్తున్న ప్రతి ఒక్కరికీ వైఎస్ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ప్రజల పక్షాన పలు ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తూ నిరంతరం ప్రజల్లోనే ఉన్న సంగతిని షర్మిల మరోమారు గుర్తు చేశారు. ఎండనక, వాననక, ప్రతిరోజు ప్రజలమధ్యే గడిపారన్నారు. వైఎస్ఆర్ అన్ని పథకాలను కొనసాగిస్తూ పన్నులు పెంచని ప్రభుత్వం రావాలంటే వైఎస్సార్ సీపీనే గెలిపించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.