ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యాల పరిధిలోనే ఉండే అవకాశం ఉందని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక తెలియజేసింది. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చీ–పోయే ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.
మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ఇది ఎంత స్థాయిలో ఉండాలనేది నిర్ణయించడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం ఈ లక్ష్యం 3.5 శాతంకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 3.2 శాతంగా ఉండాలని బడ్జెట్ నిర్దేశించింది. అయితే ద్రవ్యలోటు లక్ష్య సాధనకు దాదాపు రూ.70,000 కోట్ల మేర పెట్టుబడుల కోతకు ప్రభుత్వం మొగ్గుచూపే వీలుందని కూడా నివేదిక అభిప్రాయపడింది.
భవిష్యత్ చర్యలపైనే రికవరీ: డీ అండ్ బీ
కాగా భారత వృద్ధి క్షీణ స్థితి పూర్తియినట్లేనని ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఇండియా లీడ్ ఎకనమిస్ట్ అరుణ సింగ్ పేర్కొన్నారు. అయితే భారతదేశ భవిష్యత్ రికవరీ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నటుకూడా ఆయన వివరించారు. ఎగుమతుల్లో రికవరీ, కొంత తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడి, స్థిర ఎఫ్డీఐలు వంటి అంశాలు భారత్ వృద్ధి ఊపందుకుంటుందనడానికి సూచికలని భావిస్తున్నట్లు తెలిపారు.