సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఎనిమిదో రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. కర్నూలు–వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని ఎస్ఎస్ దాబా నుంచి ఆయన ఈరోజు ఉదయం యాత్రను మొదలుపెట్టారు. అక్కడ నుంచి పాదయాత్ర చాగలమర్రి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు పూలతో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు మీదుగా చక్రవర్తులపల్లెకు చేరుకుంటారు. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండు సెంటర్లో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అలాగే గొడిగనూరులో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
కాగా ఇవాళ నుంచి ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ నెలాఖరువరకు యాత్ర కొనసాగనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి నుంచి మొదలైన ఈ యాత్ర బనగానపల్లె, డోన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల మీదుగా పత్తికొండ నియోజకవర్గం వరకూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ నేరుగా తెలుసుకోనున్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చడంలో విఫలమైన తీరును ఆయన ఎండగట్టనున్నారు. కర్నూలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలోనూ ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు.