మచిలీపట్నం: లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. బందరు నగరంలో 12 చోట్ల రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే చోట నిత్యావసర సరుకులు కూడా విక్రయించనున్నారు. కరోనా వైరస్వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజానీకం దీని బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజానీకం ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. బందరు నగరంలో దీనిపై నగర పాలక, సంస్థ పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లాకోర్టు సెంటర్లో ఒకే రైతు బజారు ఉంది. నగరంలోని అన్ని కాలనీల వారు ఇక్కడికే వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రైతు బజారులో జనాన్ని కట్టడి చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నగరంలో 12 చోట్ల ఏర్పాటు చేస్తున్న రైతు బజార్లులో నిత్యావస సరుకులు కూడా అందుబాటులో ఉంటాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని నగర పాలక సంస్థ కమీషనర్ శివరామకృష్ణ వెల్లడించారు.
రైతు బజార్లు ఏర్పాటు చేసే ప్రదేశాలు:
నగరంలోని పన్నెండు ప్రదేశాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజానీకం అదే చోట సరుకులను కొనుగోలు చేయాలి. వేరే చోట కొనుగోలు చేసేందుకు వెళ్లకూడదనే ఆంక్షలను విధించారు. ప్రతీ రోజూ ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రైతు బజార్లు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత ఎవ్వరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదు.
1.జిల్లా కోర్టు సెంటర్–రైతు బజార్
2.జెడ్పీ సెంటర్– స్విమ్మింగ్ ఫూల్ సమీపంలో
3.పరాసుపేట– నిర్మలా హైస్కూల్ సమీపంలో
4.రామానాయుడు పేట– టౌన్ హాల్
5.పోర్టురోడ్– రైల్యేస్టేషన్
6.నోబుల్ కాలేజీ రోడ్– నోబుల్ కాలేజీ
7.ఖాలేఖాన్ పేట– మంచినీటి కాలువ వద్ద
8.చింతగుంటపాలెం– మీ సేవ కేంద్రం వద్ద
9.మూడు స్తంభాల సెంటర్– ఆర్టీసీ బస్స్టాఫ్ పాయింట్ వద్ద
10హౌసింగ్ బోర్డు కాలనీ–రోడ్డు పక్కన
11.చిలకలపూడి సెంటర్– మార్కెట్లో
12.కోనేరు సెంటర్–సామాస్ దుకాణం సమీపంలో