నెల్లూరు, కావలి: ఆరు నెలలు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందని, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. కావలిలోని 5వ వార్డులో శుక్రవారం ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పాల్గొని ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికంగా ఉన్న సమస్యలతోపాటు హౌసింగ్, పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల అమలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలకు, కులమతాలకతీతంగా ప్రజలంతా సంతోషించేలా మంచి కార్యక్రమాలు, పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.