పాల్మన్‌పేటలో దాడుల బీభత్సం | Sakshi
Sakshi News home page

పాల్మన్‌పేటలో దాడుల బీభత్సం

Published Wed, Jun 29 2016 1:13 AM

పాల్మన్‌పేటలో దాడుల బీభత్సం - Sakshi

- మత్య్సకారులపై పోలీసుల సమక్షంలోనే మరో సామాజికవర్గం దాడి
- 50 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
 
 పాయకరావుపేట (విశాఖపట్నం): పాల్మన్‌పేట శివారు రాజయ్యపేటకు చెందిన వారితోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన సుమారు 400 మంది మంగళవారం పాల్మన్‌పేటపై దండెత్తారు. మత్స్యకారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. సుమారు వంద ఇళ్లలో విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడుల్లో మత్స్యకార వర్గానికి చెందిన సుమారు 50 మంది గాయపడ్డారు.

రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో వైఎస్సార్‌సీపీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ముగ్గురు పోలీసులకూ గాయాలయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని మత్స్యకారులు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిల ప్లెక్సీలు ధ్వంసం చేసి, దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నేత ప్రమేయంతో, పక్కా ప్రణాళితోనే ఈ దాడులు జరిగాయని బాధిత మత్స్యకారులు ఆరోపించారు.

Advertisement
Advertisement