-
సాహిత్యం- కొత్త పుస్తకాలు
మావో కుహనా మార్క్సిస్టు! మేం మళ్లీ వస్తాం..... కొందరు టేబుల్ను తిరగేస్తారు. నాలుగు కాళ్లు తిరగబడి అడుగు కనపడుతూ... అదీ టేబులే! కాని చూడాల్సిన పద్ధతి వాడాల్సిన పద్ధతి అదేనా? కాని ఒకోసారి అదీ తప్పు కాదు అంటారు తోలేటి జగన్మోహనరావు వంటి అన్వేషకులు. ఇవాళ్టి ఈ పెట్టుబడిదారి ప్రపంచంలో, అమెరికా కేంద్రక ప్రపంచంలో, ‘స్పాన్సర్డ్’ ప్రజాస్వామ్య ఉద్యమాల/ రబ్బర్స్టాంప్ ప్రభుత్వ ఏర్పాటుల ప్రపంచంలో భవిష్యత్తు మార్క్సిజానిదే అని చెప్పడానికి సాహసిస్తున్నారు తోలేటి జగన్మోహనరావు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఉత్థానాన్ని, పతనాన్ని విశ్లేషించడానికి ఆయన వెనక్కు వెనక్కు ప్రయాణిస్తూ అధ్యయనం చేస్తూ ‘తప్పులు ఎన్ని చేసినా’ స్టాలిన్ను గొప్ప మార్క్సిస్టు- లెనినిస్టుగా గుర్తిస్తూ, ఒప్పులు ఎలా ఉన్నా మావో మార్క్సిజానికి తీవ్ర నష్టం కలుగచేశాడని భావిస్తూ నిర్ధారణలకు వచ్చినట్టుగా కనిపిస్తారు. ఇలాంటి మాటలు సాధారణంగా చాలామంది మావో భక్తుల గుండెలవిసి పోయేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని దూరంగా పుల్లతో నెట్టేయాలని భావిస్తారు కూడా. కాని రచయితకు ఈ సంగతి తెలుసు. అందుకే ఓపెన్ మైండ్తో చదవమని కోరుతున్నారు. ఈ ప్రపంచం మార్క్సిజం వెలుతురులో కళకళలాడాలని ఆయన కోరిక. అయితే అందుకు పాత దేవుళ్లను గుడ్డిగా పూజించకుండా కొత్త భూమికలను ఏర్పాటు చేసుకోవాలనేదే కామన. ఏమైనా ఇది పేజీల కొద్దీ చర్చకు తావు ఇచ్చే పుస్తకం. ఆస్తికులు, నాస్తికులు కూడా తప్పక చదవాలి. చర్చించాలి. తోలేటి వంటి సీరియస్/సీనియర్ రచయిత ఏడేళ్ల పాటు శ్రమకోర్చి రాశారంటే ఇది పైపైన చూసి నాలుగు రాళ్లు విసిరే పని ఎంత మాత్రం కాదు. మేం మళ్లీ వస్తాం- తోలేటి జగన్మోహన రావు; వెల: రూ.150; ప్రతులకు: 99082 36747 నిఖిలేశ్వర్ విమర్శ కవిత్వ శోధన నిఖిలేశ్వర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దిగంబర కవిగా మాత్రమే గాక కథా రచయితగా (నిఖిలేశ్వర్ కథలు), తెలుగు/హిందీ అనువాదకుడిగా (మరో భారత దేశం - వివిధ), జైలు జ్ఞాపకాలు మిగుల్చుకున్న ఉద్యమకారుడిగా (గోడల వెనుక) ఆయన రచనలు పాఠకులను విస్తృతంగా చేరాయి. మండుతున్న స్వరం, ఈనాటికీ వంటి కవిత్వ సంపుటులతో ఆయన తన వ్యక్తిగత ఉనికిని కవిగా చాటుకున్నారు కూడా. అయితే కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని ఆర్తిని విశ్లేషణాదృష్టిని ఆయన వృథా పోనివ్వలేదు. అనేక సందర్భాల్లో కవులను, వారి కవిత్వాలను, కవితా ధోరణులను, కవిత్వ పరిణామాలను తన వ్యాసాలలో రికార్డు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు ‘కవిత్వ శోధన’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో ఉన్న వ్యాసాలలో ‘తెలుగులో ఒక్క ఆధునిక మహాకావ్యం కూడా రాలేదు’, ‘భావ దారిద్య్రమా? కవిత్వ లోపమా?’, ‘శ్రీశ్రీకి ముందు అంతా శూన్యమా?’ మంచి ఆలోచింపదగ్గవి. నిజమైన ప్రజాపోరాటాలు సాహిత్యానికి సక్రమమైన రూపు ఇస్తాయి అని విశ్వసించే నిఖిలేశ్వర్ భావధారను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. కవులు, విమర్శకులు తప్పక చదవదగ్గ పుస్తకం. కవిత్వ శోధన- నిఖిలేశ్వర్; వెల: రూ.75; ఎమెస్కో ప్రచురణ; ప్రతులకు: 0866 2436643 గొల్ల రామవ్వ.... కెటిల్... కరీంనగర్ జిల్లా కథలు.... కరీంనగర్ అంటే అందరికీ తెలిసింది అది విప్లవభూమి అనే. కాని అక్కడ ఉద్యమాలతో సమానంగా కథ కూడా వికసించింది. రజాకార్ ఉద్యమకాలంలో సాక్షాత్తు పి.వి.నరసింహారావే ప్రజల పక్షాన నిలబడి ‘గొల్ల రామవ్వ’ వంటి శక్తిమంతమైన కథను రాశారు. గూడూరి సీతారాం, తాడిగిరి పోతరాజు, అల్లం రాజయ్య, బి.ఎస్. రాములు.... కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద పెద్ద కథలు బయలుదేరి వచ్చి తెలుగు కథను సంపద్వంతం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విశాల సాహిత్య అకాడమి ‘ఆధునిక కథా సరిత్సాగరం’ పేరుతో కరీంనగర్ జిల్లా కథలను వివిధ సంకలనాలుగా వెలువరిస్తోంది. ఇప్పటికి మూడు సంకలనాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగోది వచ్చింది. మొత్తం 20 మంది కథకుల కథలు ఉన్న ఈ సంకలనంలో కొక్కుల పద్మావతి, గుండెడప్పు కనకయ్య, కూతురు రాంరెడ్డి, వేముల ప్రభాకర్ వంటి వర్తమాన కథకులతో పాటు బిఎస్ రాములు, గూడూరి సీతారాం, పివి నరసింహారావు, తాడిగిరి పోతరాజు వంటి సీనియర్ రచయితల కథలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఇవాళ ‘గణపతి’గా అందరికీ తెలిసిన మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణరావు రాసిన ‘ఎత్తున్రి పిడికిళ్లు’ కథ కూడా ఇందులో ఉంది. కరీంనగర్ జీవన పరిణామాలకు అద్దం ఈ సంకలనం. కరీంనగర్ జిల్లా కథలు (నాల్గవ సంపుటి)- సంపాదకులు: బిఎస్ రాములు, వనమాల చంద్రశేఖర్; వెల: రూ.100; ప్రతులకు: 83319 66987, 97047 08980 -
ముల్లా నసీరుద్దీన్ కథలు
ముల్లా నసీరుద్దీన్ వాక్చమత్కారానికి, సద్యఃస్ఫూర్తికి పెట్టింది పేరు. వ్యంగ్యంతో కూడిన హాస్య కథలు ఆయన సొత్తు. సామాన్యుడులా కనిపించే అసామాన్యుడు. అమాయకుడులా కనిపించే అఖండ మేధావి. విదూషకుడులా కనిపించే జ్ఞాని. సూఫీ తత్వవేత్త. డాబు, దర్పం ఏ మాత్రం ఎరుగని నిష్కల్మష హృదయుడు. ప్రజల మనిషి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముల్లా నసీరుద్దీన్ టర్కీ దేశంలో పుట్టి ఏడు వందల ఏండ్లు గడిచిపోయినా ప్రపంచం ఆయన్ను మరచిపోలేదు. పోదు. ప్రజలు ఆయన్ను ఎంతగా ప్రేమించారంటే, చాలా దేశాలు ఆయన్ను తమ దేశానికి చెందిన వాడుగానే భావించి గౌరవిస్తున్నారు. మొదట్లో ఆయన పేరు మీద ఉన్న కథలు ఎన్నో చెప్పలేముగాని, ప్రతి తరంలోనూ కొత్త కొత్తవి చేర్చబడుతూ, పాతవి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ, నేటికి వాటి సంఖ్య వెయ్యి వరకు వచ్చింది. చాలా దేశాల్లో ఈ కతలు వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా మార్పు చెంది, జానపద కథల్లో భాగమై పోయాయి. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ కథలు అనువాదం చెందాయి. నలుగురు కలిసి కూర్చున్న చోట, నసీరుద్దీన్ కథలు చెప్పుకొని ఆనందించటం చాలా దేశాల సంస్కృతుల్లో ఆనవాయితీగా ఉన్నది. సందర్భానికి తగ్గట్టుగా ఏదో కథ ఉంటుంది. ప్రతి కథలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోతుగా ఆలోచిస్తే తెలిసే లోపలి అర్థం ఇంకొకటి ఉంటుంది. గంభీరమైన తాత్వికార్థం ఉండబట్టే ఈ కథలకు అంతటి ఖ్యాతి, గౌరవం లభించింది. ముల్లా నసీరుద్దీన్ కథల గురించి ఉపన్యసించే కంటే, ఆ కథల్నే ఒకటి రెండు వినిపిస్తే వాటి గొప్పతనం వినేవాళ్లకు చప్పున స్ఫురిస్తుంది. ఎవరిని నమ్మేది? ముల్లా నసీరుద్దీన్ ఇంటికి ఓ పొరిగింటాయన వచ్చి తలుపు కొట్టాడు. ముల్లా తలుపు తీశాడు. ‘ఈ ఒక్కరోజుకు నీ గాడిదను అరువిస్తావా? పక్క ఊరికి సరుకు తీసుకు వెళ్లాలి’ అని అడిగాడు ఆ వచ్చినాయన. గాడిదను ఇవ్వడం ముల్లాకు ఇష్టం లేకపోయింది. తన అయిష్టత బయట పడకుండా ముల్లా సమాధానం చెప్పాడు.‘క్షమించాలి. ఏమనుకోకు. నేను ఈ వరకే గాడిదను ఇంకొకరికి ఇచ్చాను’సరిగ్గా అదే సమయానికి దొడ్లో కట్టివేసిన గాడిద ఓండ్ర పెట్టటం వినిపించింది. ‘ముల్లా. మరి నీ గాడిద అరుపు వినిపిస్తోంది గదా’ అన్నాడు ఆ పొరిగింటాయన. ‘ఎవర్ని నమ్ముతావు నీవు?’ చిరాగ్గా అడిగాడు ముల్లా. ‘నన్నా... ఆ గాడిదనా?’ ఒకటే రుచి ద్రాక్ష పళ్లతో నిండిన రెండు బుట్టల్ని గాడిద మీద వేసి తోట నుండి తిరిగి వస్తున్న ముల్లాను చూశారు కొంతమంది పిల్లలు. వాళ్లు నసీరుద్దీన్ చుట్టూ చేరి రుచి చూడటానికి కాసిని ద్రాక్ష పళ్లు అడిగారు. ముల్లా ద్రాక్ష గుత్తినొక దాన్ని తీసి తలా ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ‘అన్ని ద్రాక్ష పళ్లు ఉన్నవి గదా నీ దగ్గర. మాకిచ్చేది ఇంతేనా?’ అని గొణిగారు వాళ్లు. ‘బుట్టడైనా, ఒక్కటైనా తేడా ఏం లేదు. అన్నింటిదీ ఒకటే రుచి’ అంటూ ముల్లా ముందుకు సాగిపోయాడు. ప్రసంగం: ఓసారి నసీరుద్దీన్ను మతం గురించి ప్రసంగించవలసిందిగా ఆ ఊరి వాళ్లు కోరారు. ప్రసంగించే ముందు నసీరుద్దీన్ అడిగాడు- ‘నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?’. తెలియదని చెప్పారు వాళ్లు. వెంటనే నసీరుద్దీన్ ‘నేను ఏం మాట్లాడబోతున్నానో తెలియనివాళ్ల ముందు ప్రసంగించటం నాకు ఇష్టం లేదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్లో వాళ్లు చాలా తర్జనభర్జన పడి, మర్నాడు మళ్లీ ఆయన్ను పిలిచారు. ఈసారి నిన్నటికి మల్లే అదే ప్రశ్న వేయగా అందరూ ‘తెలుసు’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముల్లా ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు ముందుగానే తెలుసు గాబట్టి మీ సమయాన్ని నేను వృథా చేయను’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.దాంతో వూరి వాళ్లందరూ నిజంగానే అయోమయంలో పడ్డారు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని, మరుసటి రోజు మళ్లీ నసీరుద్దీన్ను ఆహ్వానించారు. అతడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు తెలుసా?’ ఈసారి వాళ్లంతా ముందుగానే కూడబలుక్కుని వచ్చారు. అందువల్ల సగం మంది ‘తెలుసు’ అని, సగం మంది ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ అన్నాడు- ‘తెలిసిన సగం మంది తెలియని సగం మందికి చెప్పండి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లెక్క ఒకప్పుడు నసీరుద్దీన్ దగ్గర కొంత డబ్బు పోగైంది. దాంతో చాలామంది ఆయన చుట్టూ చీమల్లా చేరారు. ఒకాయన నసీరుద్దీన్ను అడిగాడు ‘ముల్లా. నీకెంత మంది స్నేహితులు ఉన్నారో లెక్క చెప్పగలవా?’ అని. అందుకు నసీరుద్దీన్ అన్నాడు, ‘ఇప్పటికిప్పుడు లెక్క చెప్పటం ఎలా కుదురుతుంది? చేతిలో పైసా లేనప్పుడు గదా ఆ లెక్క తెలిసేది? ’వెతకడం ఓసారి ముల్లా నసీరుద్దీన్ తన ఇంటి బయట ఏదో వెతుకుతూ ఒకతనికి కనిపించాడు. ఏమిటి అని అడిగితే తాళం చెవి కోసం అని సమాధానం చెప్పాడు. ఆ అడిగిన మనిషి కూడా ముల్లాతో పాటు వెతకటం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక అతడు అడిగాడు. ‘నీవు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నావు?’ ముల్లా సమాధానం - ‘ఇంట్లో’ ‘మరి ఇక్కడ వెతుకుతున్నావెందుకు?’ ‘ఇంట్లో కంటే ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది’ అని ముల్లా సమాధానం. ఇలా ఉంటవి ముల్లా నసీరుద్దీన్ కథలు. అటు టర్కీ నుంచి ఇటు చైనా, రష్యాల దాకా ఇవాళ ఆయన పేరు విననివాళ్లు లేరు. ముల్లా నసీరుద్దీన్ను కొన్ని దేశాల్లో నసీరుద్దీన్ హోడ్జా అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నసీరుద్దీన్ ఉత్సవం ప్రతి సంవత్సరం అతని నివాస స్థలమైన టర్కీలోని అక్సెహిర్ పట్టణంలో జూలై 5- 10 మధ్య జరుగుతుంది. యునెస్కో వారు 1996-97 సంవత్సరాన్ని అంతర్జాతీయ నసీరుద్దీన్ సంవత్సరంగా గుర్తించి, అతని కథలకు అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగచేశారు. - దీవి సుబ్బారావు -
ఒక పెంకుటిల్లు....
గుడిసె ఉంటే నష్టం లేదు. కలో గంజో. రేషన్ బియ్యమో. ఉపాధి హామీ పథకమో. ఉంటే సరే. లేకపోయినా సరే. అడిగేవారే లేరు. బంగ్లా! అయ్య బాబోయ్. నౌకర్లు చాకర్లు కార్లు కారిడార్లు కరెన్సీ నోట్లు డాగ్స్ గేట్స్ గూర్ఖాస్. అడిగేవారే లేరు. హూ డేర్స్! కాని ఈ పెంకుటిల్లు ఉందే! ఏం వొదినా పిల్లకు ఇంకా పెళ్లి చేయలేదేం! ఏం బావగారూ అబ్బాయికి ఇంకా ఉద్యోగం పడలేదా. ఏవయ్యా సుబ్బారావ్. అమ్మను ఆస్పత్రిలో చూపించకపోతే ఎలాగయ్యా? ఏమమ్మా మహలక్ష్మమ్మ... కోడల్ని అలా రాచి రంపాన పెట్టకపోతే నాల్రోజులు పుట్టింటికి పంపొచ్చు కదా. కెమెరాలు పెట్టినట్టే. గేట్లో. వాకిలిలో. హాలులో. పెరట్లో. అందరికీ అన్ని తెలిసిపోతాయి. అందరికీ అన్నీ కావాలి. అందరూ అన్నింటి మీదా తీర్పు చెప్తారు. సమాజం అంటే ఇంకేమిటి? ఈ పేదోళ్లు? కాదు. ఈ డబ్బున్నోళ్లు? కానే కాదు. సమాజం అంటే ఈ దేశంలో అచ్చంగా మధ్యతరగతి. నలుగురూ ఏమైనా అంటారు... అనంటే మధ్యతరగతిని చూసి మధ్యతరగతివారు ఏమైనా అంటారనే. నలుగురిలో పరువు పోవడం అంటే మధ్యతరగతి వారి పరువు మధ్య తరగతివారి మధ్యన పోవడం అనే. నలుగురూ అంటే ఒక పెంకుటిల్లు. నలుగురూ అంటే ఇప్పుడు బహుశా ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్. కథ ఏం మారలేదు. కాకుంటే అప్పట్లో అందరూ కలిసి ఒక చూరు కింద ఉండేవాళ్లు. ఇప్పుడు? కొడుకు కోడలు పట్నంలో. తల్లిదండ్రులు ఊళ్లో. తమ్ముడు ఇంకో చోట. చెల్లెలు మరెక్కడో. కాని కథ మారిందా? అన్నయ్యా... బావగారి ఉద్యోగం పోయింది ఒక పదివేలు సర్దు. ఏరా... డాక్టర్లు ఆపరేషన్ అంటున్నారు ఏం చేస్తావ్? చెల్లెలి పెళ్లి బాధ్యతే లేనట్టుగా ఎవర్నో చేసుకుంటే సరా... ఇప్పుడెలా? అవే కథలు. గతంలో రెండు మూడు వేలకు ప్రాణాలు లేచిపోయేవి. కుటుంబాలు కూలిపోయేవి. మనుషులు శలభాల్లా మాడిపోయేవారు. ఇప్పుడు- ఒక రెండు మూడు లక్షల మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయగలదు. పేకమేడలా కూల్చేయగలదు. ఒక్క కాలేజీ ఫీజు చాలు ఒక తండ్రిని బికారిని చేయడానికి. నన్ను చదివించలేనివాడివి ఎందుకు కన్నావు నాన్నా... కొడుకు ఎస్ఎంఎస్ పెడితే చాల్దూ... మోసుకెళ్లడానికి ఒక ఒన్నాట్ ఎయిట్. కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ నవల 1956లో వచ్చింది. మధ్యతరగతి జీవితాన్ని చూసి చూసి, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాల్ని కాచి వడపోసి, మధ్యతరగతి బాదరబందీలతో వేగి వేగి, మధ్యతరగతి జీవితాల్లోని కాసిన్ని వెసులుబాటుల్ని- చిర్నవుల్ని- దేవుడు కరుణిస్తే కాసింత కోలుకోవటాలనీ- చూసి చూసి ఆయన రాసిన నవల ఇది. ఇంతకీ ఈ నవలలో ఏముంది? అబ్బ. చెప్పాలంటే దుఃఖం వస్తుంది. కాసింత వయసు వచ్చినవారికి బాల్యం అంతా కళ్ల ముందు తిరుగుతుంది. కాసింత టౌన్లలో గడిపినవారికి తాము నివసించిన వీధో, తాము చూసిన పక్కిల్లో, తమకు తారసపడిన కుటుంబమో, తమ మేనమామో, అన్నింటికి మించి తమ ఇల్లు... అవును... తమ పెంకుటిల్లే గుర్తుకు వస్తుంది. పనేం లేని నాన్న. ఆయనకు అణకువగా ఉండే అమ్మ. ఇంటి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న బాధ్యత గలిగిన అన్న. అన్నీ తెలిసి సహనంగా అందంగా ఆదరువుగా ఇంటికి ధైర్యలక్ష్మిగా ఉండే (పెళ్లికాని) చెల్లెలు. ఒక చిన్న తమ్ముడు. కొన్ని బాకీలు. రెండు కుర్చీలు. ఒక ముసలామె. చేదబావి. ఆ పూట గడిచి. గుట్టుగా బతుకుదామనుకొని. కాని డబ్బు కష్టాలు. జబ్బులనీ పెళ్ళిళ్లనీ ప్రమాదాలనీ... ఒక తరం అలా అలా బతికింది అనుకుంటే ఇంకో తరం చతికిల పడుతుంది. ఇంకో తరం కోలుకుంది కదా అనుకుంటే ఆ పై తరం. అలాంటి కథే ఇది. కాని కొమ్మూరి వేణుగోపాలరావు గట్టిగా నమ్మిన విషయం ఒకటి ఉంది. కష్టపడాలి. రికామీగా ఉండరాదు. బాధ్యతల నుంచి పారిపోరాదు. పరిస్థితులకు దాసోహం అనరాదు. కష్టం ఒక్కటే, జాగ్రత్త ఒక్కటే, బాధ్యత ఒక్కటే మధ్యతరగతిని కొద్దో గొప్పో కష్టాల నుంచి దూరం పెడుతుంది. పెంకుటిళ్లను కాపాడుతుంది. ఆయన గ్రహించిన మరో విషయం ఉంది. మధ్యతరగతి వాళ్లు అవినీతి చేయక్కర్లేదు. జరిగిన అవినీతిని కప్పెడితే చాలు. తప్పు చేయక్కర్లేదు. తప్పును చూసీ చూడనట్టు ఉంటే చాలు. బలహీనతలను అప్రయోకత్వాలను ఒకరు కాకపోయినా మరొకరు కాచుకున్నా చాలు. ఏదో గడిచిపోతుంది. ఏం చేస్తాం మరి చాలీచాలని బతుకు. ఈ బతుకులో ఇంతకు మించి తెగించలేము. ఇది ఎంత శక్తిమంతమైన నవల అంటే ఇది చదువుతున్నంత సేపూ ఇందులోని జీవితాన్ని మనం జీవిస్తాం. ఇందులోని పాత్రలు చిదంబరం, శారదాంబ, నారాయణ, ప్రకాశరావు, రాధ, శకుంతల, చిన్న తమ్ముడు వాసు... వీళ్లందరి జీవితాల్లో జరిగే ఘటనలు కొన్ని లిప్తలపాటైనా మన ఊహాలోకంలో మన అనుభూతిలోకి వస్తాయి. సానుభూతి కలుగుతుంది. నిస్సహాయంగా అనిపిస్తుంది. వాళ్లు కొంచెం బాగుపడే పరిస్థితి వస్తే అమ్మయ్య అనిపిస్తుంది. ఈ నవల మొదలులో ఇంటి ముంగిట్లో చాలా చెత్త ఉందని చెప్తాడు రచయిత. ఆ చెత్తను తొలగించే శ్రద్ధ ఎవరికీ లేదు. (ఆనాడు) మధ్యతరగతి బలం దాని సంఖ్యే. నలుగురూ నాలుగు చేతులేస్తే ఆ చెత్త పోతుంది. నలుగురూ నాలుగు చక్రాలుగా మారితే ఇంటి బండి నడుస్తుంది. అది ముఖ్యం. ఆ ఇల్లు అలా నిలబడి ఉండటం ముఖ్యం. ఉన్న పెంకుటిల్లునో, ఏదో ఒక నీడనో, రాజీవ్ స్వగృహనో, సెకండ్ హ్యాండ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్నో పొందాలని వెంపర్లాడే మధ్యతరగతి కాంక్ష ఉందే- అది ఆ నవలలో ఉండే మనుషులకీ ఈనాటి మనుషులకీ మారలేదు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ‘పెంకుటిల్లు’ నవలలో పొలాన్నయినా అమ్ముకున్నారుగాని ఇంటిని మాత్రం అమ్ముకోలేదు. ఎందుకంటే మధ్యతరగతి వారు ముఖం దాచుకోవడానికి ఒక ఇల్లు అవసరం. ఆ ఇల్లే గనక లేకపోతే వారి బతుకు నరకం. టైమ్ మిషన్లో కూచుని పాతరోజుల్లో ప్రయాణించాలనుకునేవారు ఈ నవలను చదివి బయటపడటానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. కొంత విస్తృతి ఉన్నా, కొంత పధకం ప్రకారం గమనం లేకున్నా, శరత్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఇది అసలు సిసలు తెలుగు నవలే! మధ్యతరగతి వాళ్లది అని చెప్పుకోవడానికి ఒకే ఒక మంచి నవల! చెక్కు చెదరని పాత కట్టుబడి!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement