పెబ్బేరు రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ తిరువీధి సేవ, రథాంగ హోమం, గజవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మేళతాళాల వాయిద్యాల నడుమ రంగనాథస్వామి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు విష్ణునారాయణ, అర్చకులు గోవిందాచార్యులు, సురేషాచార్యులు, కన్నయ్యస్వామి, బధ్రీనాథ్ ఆచార్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు రథోత్సవం..
సోమవారం నిర్వహించే రంగనాథస్వామి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈఓ శేఖర్గౌడ్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులతో ఆలయ పరిసరాలు, రోడ్లు శుభ్రం చేసి బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు.