సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా కరెంట్ తీగ ముట్టుకుంటే ఎవరికై నా షాక్ కొడుతుంది కానీ.. సబ్స్టేషన్లలో కీలకమైన పవర్ ట్రాన్స్ఫార్మర్ల (పీటీఆర్)లకు పిల్లులు, పక్షులు, ఎలుకలు, ఉడతలు, తొండలు, బల్లులు షాక్ ఇస్తున్నాయి. పిల్లులు ఇటు.. అటు ఎగురుతూ బ్రేకర్లపై పడుతుండటంతో పక్షులు, ఉడతలు, తొండలు, బల్లులు కండక్టర్– ఇన్సులేటర్ల మధ్య తిరుగుతూ విద్యుత్ షార్ట్సర్క్యూట్లకు కారణమవుతున్నాయి. ఫలితంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఫీడర్లు తరచూ ట్రిప్పవుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం నందనవనం సబ్స్టేషన్లోకి ఓ పిల్లి దూకింది. సబ్ష్టేషన్కు ఆనుకుని ఉన్న మున్సిపల్ చెత్త సేకరణ కేంద్రం నుంచి ఎగిరి సబ్ష్టేషన్లోని బ్రేకర్పై పడటంతో భారీ శబ్దంతో పీటీఆర్లో పేలుడు సంభవించింది. సబ్స్టేషన్లోని రెండు 12.5 సామర్థ్యం ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 13 ఫీడర్ల పరిధిలో సుమారు రెండు గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన ఇంజనీర్లు వెంటనే బ్రేకర్, పీటీఆర్లను పునరుద్ధరించాల్సి వచ్చింది. 33/11 కేవీ జైన్ మందిర్ ఫీడర్ ఇన్సులేటర్–కండక్టర్ల మధ్య ఓ పావురం చిక్కి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెడ్హిల్స్ ఫీడర్లోనూ ఇదే సమస్య తలెత్తింది. సబ్స్టేషన్ల చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో వాటి చుట్టూ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో పిల్లులు, ఎలుకలు, కుక్కలు అక్కడ సంచరిస్తున్నాయి.
విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..
ప్రస్తుతం ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సిటీజనులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం రెట్టింపు నమోదవుతోంది. 20వ తేదీన 3451 మెగావాట్లు(73.6 ఎంయూల) విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, 21న 3407 మెగావాట్లు (72.4ఎంయూలు), 22న 3502 మెగావాట్లు (74.0 ఎంయూలు), 23న 3410 మెగావాట్లు (73.9 ఎంయూ), 24న 3137 మెగావాట్లు(70.3 ఎంయూ), 25న 3181 మెగావాట్లు (70.23 ఎంయూ)ల చొప్పున విద్యుత్ వినియోగం రికార్డు అయింది. తాజాగా మంగళవారం రికార్డు స్థాయిలో 3580 మెగావాట్ల డిమాండ్ నమోదు కావడం గమనార్హం.