-
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
హస్తినలో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. సీఎం రేవంత్ తదితరులు ఏఐసీసీ కీలక నేత రణ్దీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సాయంపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మూడు కీలకాంశాలపై చర్చ ఉంటుందా? సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి ఢిల్లీ బయలుదేరడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ పార్టీ హైకమాండ్ను కలిసి మూడు కీలకాంశాలపై చర్చించే అవకాశముందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల గురించి హైకమాండ్తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు కీలకమైన కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే, కేబినెట్ విస్తరణ లోక్సభ ఎన్నికల తర్వాత ఉంటుందా? ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ (లంబాడా), బీసీ, మైనార్టీలకు కేబినెట్లో బెర్తులు దక్కాల్సి ఉంది. ఈ బెర్తులను భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికలకు వెళితే ఉపయోగం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, మరో మూడు బెర్తులకు పోటీ తీవ్రంగా ఉన్నందున ఇప్పుడే కాకుండా లోక్సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని, ఒకవేళ ఈ పర్యటనలో హైకమాండ్తో ఈ విషయం గురించి చర్చ జరిగి, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ లభిస్తే త్వరలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, లేదంటే పార్లమెంటు ఎన్నికల వరకు ఆగాల్సిందేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి అవకాశంపై చర్చ? లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఓ అభిప్రాయానికి వస్తున్నట్టు అర్థమవుతోంది. హైదరాబాద్ (మైనార్టీ), కరీంనగర్ మినహా 15 స్థానాల్లో పోటీకి ఎవరిని దింపాలన్న దానిపై షార్ట్ లిస్ట్ రెడీ అయిందని, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్కు పంపారని, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలోకి ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతున్నాయి. బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), నీలం మధు (మెదక్), పట్నం సునీతారెడ్డి (చేవెళ్ల), వెంకటేశ్ నేతకాని (పెద్దపల్లి), కంచర్ల చంద్రశేఖర్రెడ్డి (మల్కాజ్గిరి), తాటికొండ రాజయ్య (వరంగల్)కు లోక్సభ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత వచ్చిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాల్లో పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ అభ్యర్థిత్వాల విషయంలో అనుసరించనున్న మార్గదర్శకాలపై కూడా సీఎం, డిప్యూటీ సీఎం, శ్రీధర్బాబు చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. నామినేటెడ్ ‘నారాజ్’.... పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదనే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నా ఈ పదవులను పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తొలుత 9 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారనే చర్చ జరగ్గా, ఆ తర్వాత ఆ సంఖ్య 18కి చేరింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ పదవుల పంపకాలుంటాయని ఓసారి, ఎన్నికల తర్వాతే ఉంటాయని మరోసారి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అడపాదడపా కొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే (పార్లమెంటు ఎన్నికలకు ముందే) అంశంపై కూడా ఈ పర్యటనలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని టీపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
వెళ్లిన వారు వచ్చేయండి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడినవారు తిరిగి సొంతగూటికి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ టికెట్ ఇవ్వలేదని, సరైన అవకాశాలు కల్పించలేదనే ఆవేదనతోనే కొందరు పార్టీని వదిలివెళ్లారని, వారిని తిరిగి చేర్చుకోవాలని పీఈసీ సభ్యులను కోరారు. అయితే, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు పీఈసీ అంగీకారం తెలపడంతో ఎన్నికలకు ముందు బయటకు పోయినవారు మళ్లీ వచ్చేందుకు కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. పీఈసీ భేటీలో భాగంగా గత పదేళ్ల కాలంలో విద్యార్థి, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న సూచనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. లోక్సభ అభ్యర్థులెవరు? వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై పీఈసీ ప్రధానంగా చర్చించింది. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారి నుంచి కొన్ని పేర్లను డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించారు. 17 లోక్సభ స్థానాలకుగాను 187 పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిటీకి వారు అందజేశారు. ఈ జాబితాను పరిశీలించిన పీఈసీ వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే రూ.25వేలు, ఇతరులు రూ.50వేల చొప్పున రుసుము చెల్లించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి అదే నెల ఆరో తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)తో పాటు హరీశ్చౌదరి, జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కదంలతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి కూడా పీఈసీ పంపనుంది. భేటీలో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడ ఫలానా నాయకుల పేర్లపై చర్చ జరపడం సరైంది కాదని, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏఐసీసీకి ఇవ్వాలనే సూచన రావడంతో ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లకు ఈ అధికారాన్ని కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది. మాకు అవకాశమివ్వండి భేటీలో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ లోక్సభ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్తో పాటు పార్టీ ఇన్చార్జ్ మున్షీ నిర్ణయిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.యూత్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం యూత్కాంగ్రెస్ కోటాలో ఇవ్వాలని, ఒకవేళ సమీకరణలు కుదరకపోతే రాజ్యసభ సభ్యునిగా యూత్కాంగ్రెస్ నాయకుడిని ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై అధిష్టానంతో మాట్లాడాలని పీఈసీ అభిప్రాయపడింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్బాబు, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు జానారెడ్డి, జీవన్రెడ్డి, వి.హనుమంతరావు, రేణుకాచౌదరి, మహేశ్కుమార్గౌడ్, మధుయాష్కీగౌడ్, షబ్బీర్అలీ, అంజన్కుమార్యాదవ్, అజారుద్దీన్, చల్లా వంశీచంద్రెడ్డి, బలరాంనాయక్, ప్రేంసాగర్రావు, సంపత్కుమార్, బల్మూరి వెంకట్, సునీతారావులతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. అయోధ్య అక్షింతల తరహాలో సమ్మక్క బంగారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి అక్షింతలు పంపినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సమ్మక్క–సారలమ్మ బంగారాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పంపే అంశాన్ని పరిశీలించాలని మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించారు. బెల్లంతో పాటు పసుపు, కుంకుమ పంపే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాలకు వెళ్లే బంగారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక కేడర్ నేతృత్వంలో ప్రజలకు పంచాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమైంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ఈ ప్రతిపాదనను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులతో కలిసి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు సూచించారు. -
ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీపీసీసీ చీఫ్గా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తూనే, మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్లోనే విజయం సాధించింది. మిగతా ఆరింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూరులలో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ బోథ్, ఆసిఫాబాద్లలో విజయం సాధించింది. కాగా ఖానాపూర్లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్ అన్ని సభల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్కతో హైదరాబాద్లో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, చివరలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ జరపాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను ఆకర్షించేలా మరో రెండు పథకాలు! ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా మరో రెండు గ్యారంటీల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అందులో ఒకటి రూ.500కే గ్యాస్ సిలిండర్ కాగా, మరొకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అయితే సబ్సిడీపై సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం. కాగా రూ.500కే సిలిండర్ను నేరుగా తెచ్చినప్పుడే ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రూ.500కే గ్యాస్ వచ్చిన భావన మహిళలకు కలుగుతుందని, ఇది ఎన్నికల్లో ఉపకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. -
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఏ కోటాలో ఎవరికి? రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్రెడ్డికి అసెంబ్లీలో చీఫ్విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్సాగర్రావు (మంచిర్యాల), మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలూ రేసులో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి. మైనార్టీ కోటాలో ఎవరికి? కేబినెట్లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ఖాన్ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం. త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement