-
మరియమ్మ లాకప్డెత్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరా రికార్డులను పెన్డ్రైవ్లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బంగారం కుదవ పెట్టి..బిల్లులు కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, రోగుల బంధువులు బంగారాన్ని కుదవపెట్టి బిల్లులు కట్టాల్సి వస్తోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు ఒకే తరహాలో ధరలు నిర్ణయించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మేరకు కొత్త జీవో జారీచేయాలని ఆదేశించినా పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?’అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ధరలు నిర్ణయిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది. ‘జీవో జారీకి సంబంధించి ప్రభుత్వానికి సూచన చేయలేదు, జీవో జారీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశాం. అయినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేశారంటూ ప్రైవేటు హాస్పిటల్స్పై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? అధిక బిల్లులపై 79 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొన్నా.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు? ప్రభుత్వమే ఇంత బాధ్యతారహితంగా ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉంటే ఎలా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక ఇచ్చారు ‘గతంలో ఇచ్చిన జీవోను సవరించి పీపీఈ కిట్లు, సీటీ స్కాన్ తదితర పరీక్షలకు ధరలను నిర్ణయించాలని ఆదేశించాం. ఈ మేరకు గతంలో ఉన్న ధరలను రివైజ్ చేసి తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాం. ఈ జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పాం. విపత్తు నిర్వహణ చట్టం కింద అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నాం. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని స్పష్టం చేశాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమన్నాం. కానీ ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సమర్పించిన నివేదికలో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేశారో లేదో ఎక్కడా పేర్కొనలేదు. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక సమర్పించారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు ఇందులో సమాధానం లేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఎలా..?’అంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ నివేదించగా...15 రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొనగా.. కొన్ని ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేసి డబ్బు కట్టకపోతే స్వస్థత పొందినా.. రోగిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు, లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని, విచారణకు ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా నియంత్రణకు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేటాయించిన ఔషధాలను ఆసుపత్రులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అంతకుముందు ధర్మాసనం ప్రశ్నించింది. కేటాయించిన వాటిలో ఒక్క ఇంజక్షన్ అందని పరిస్థితి ఉందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. కాగా ‘అధిక బిల్లులు వసూలు చేసిందంటూ గత ఏడాది విరించి ఆసుపత్రికి కరోనా చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఆసుపత్రిపై ఇదే తరహా ఆరోపణలు రావడంతో మళ్లీ చికిత్సలు చేయరాదని ఆదేశించారు. దీంతో లక్షలాది రూపాయలు ఫీజుగా చెల్లించిన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి వారికి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..’అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు అర్జున్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎం.రంగయ్య తదితరులు నివేదించారు. చిన్నారులకు ఒకే ఆసుపత్రా? ‘కరోనా మొదటి, రెండో దశతో ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పొంచి ఉన్న మూడో దశతో రాబోయే తరం...చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్రలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒక్క జిల్లాలోనే 8 వేల చిన్నారులు కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల వైద్యానికి నీలోఫర్ లాంటి ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రా? ఇందులోనూ 8 ఐసీయూ, 12 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉన్నాయా? ఇలా ఉంటే కరోనా బారినపడే చిన్నారులకు ఎలా చికిత్స అందిస్తారు?’అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో చర్యలు తీసుకుంటున్నామని నామమాత్రంగా మాత్రమే పేర్కొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకోసం కొత్తగా ఎన్ని పడకలను ఏర్పాటు చేశారు? ఎంతమంది వైద్య సిబ్బందిని నియమించారు? అవసరమైన ఔషధాలను ఏమేరకు సమకూర్చుకున్నారు? ఇలాంటి వివరాలేవీ నివేదికలో పేర్కొనలేదు’అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా రోగులతో ఉన్న అంబులెన్సులను ఆపేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలు తీస్తారా, రాజ్యాంగం కల్పిం చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా’ అని మండిపడింది. కేంద్రం అనుమతి లేకుండా జాతీయ రహదారులపై అంబులెన్స్లను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈ నెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ మెమో ఉందని.. ఆ మెమో జారీచేసిన అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసేలా ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్ రూం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలోకి అంబులెన్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ మెమోను మార్చి.. మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సరిహద్దుల్లో ఉన్న అధికారులకు సమాచారమిచ్చి అం బులెన్స్ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించింది. మా ఆదేశాలకు వక్రభాష్యం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం అంబులెన్సుల నిలిపివేత ఆదేశాలు ఇచ్చినట్లు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అంబులెన్స్లు ఆపొద్దంటూ ఈనెల 11న మేమిచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని ఏ చట్టం నిషేధించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉంది. అహ్మదాబాద్లో ప్రభుత్వ అంబులెన్సుల్లో వచ్చే వారినే అడ్మిట్ చేసుకోవాలంటూ, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆస్పత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొం దించాలని సుప్రీం కోర్టు ఇటీవలే కేంద్రాన్ని ఆదేశించింది కూడా. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగుల అంబులెన్స్లను రాని స్తామనడం దారుణం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. పలు రాష్ట్రాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి: ఏజీ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్ఘడ్ నుంచి పెద్ధ సంఖ్యలో కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని.. ఇక్కడ అడ్మిషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హైకోర్టుకు వివరించారు. వారంతా రోడ్ల మీదే నిరీక్షిస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన కరోనా రోగులను ఆ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు వైద్యం నిరాకరించట్లేదు. కరోనా కట్టడి, లాక్డౌన్లో భాగంగానే.. ఆస్పత్రుల్లో అడ్మిషన్ లేనివారి అంబులెన్స్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నిబంధనలకు లోబడే ఉంది’ అని వివరించారు. వివక్ష చూపించడమే: ఏపీ ఏజీ ఎస్.శ్రీరాం అంబులెన్సుల కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల మేరకు మెమో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ చట్టాల సారాంశానికి విరుద్ధంగా ఆ మెమో ఉంది. నివాస ప్రాంతం ఆధారంగా కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమే. కంట్రోల్ రూం ముందస్తు అనుమతి పేరుతో జాప్యం జరిగితే.. తగిన సమయంలోగా వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమా దం ఉంది. అంబులెన్స్ల ప్రవేశానికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపుతున్నారు. ముందస్తు అనుమతి పేరిట వివక్షతో ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు. చదవండి : తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement