-
ఎన్నికల పోరులో ఇదేం భాష?
ఈ సృష్టిలో మాట్లాడగలిగే మహ ద్భాగ్యం మనిషికే ఉంది. ఆ మాటను సవ్యంగా ఉపయోగిస్తే మాటే మంత్రమై గొప్ప గొప్ప పనులు నెరవేరుస్తుంది. లేదంటే ఆ మాటే కార్చిచ్చు అవుతుంది. నేటి ఎన్నికల సమరాంగణంలో భాషా ప్రయోగం ఎలా ఉంది? దాని పాత్ర ఏంటో చూద్దాం.భాష అంటే మనసులో ఉన్న భావాన్ని మాటల రూపంలో వ్యక్తం చేసే సాధనం. ప్రస్తుత ఎన్నికల వ్యవ హారం చూస్తుంటే అమ్మ భాషకు తూట్లు పొడుస్తున్నట్లుంది. ఎన్నికల్లో పోటీచేసే ప్రతీపార్టీ ప్రతినిధులూ ఓటరు వద్దకు వెళ్లి, ఓటు కోసం అభ్యర్థించడం సర్వసాధారణమైన అంశం. అభ్యర్థించడం అంటేనే ఒక విన్నపం. విన్నపం అంటేనే వినయంగా అడిగేది. కానీ పార్టీ ప్రచార సభల్లో నాయకులు తమ తమ విద్యాస్థాయులు, హోదాలు మరచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం శోచనీయం.నేటి ఎన్నికల ప్రచార సభల్లో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి అజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తారు? వారి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి, ఇతర పార్టీ నాయకులను దుయ్యబట్టడమే అజెండాగా కనిపిస్తోంది. ‘నీ తోలు తీస్తా, నీ పళ్లు రాలగొడతా, చెప్పుతో కొడతా, చిప్పకూడు తినిపిస్తా...’ వంటి అప్రజాస్వామిక భాషను వాడడం ఎంతవరకు సబబు? కొంతమంది నేతలు, వేరే నాయకులను దూషిస్తూ, కించపరుస్తూ, కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నిన్ను పాతాళానికి తొక్కేస్తా’ అంటారొకరు. ఒక వ్యక్తిని అధికార పీఠం ఎక్కించాలా, దించాలా, పాతాళానికి తొక్కేయాలా అనేది నిర్ణయించేది వీళ్లు కాదు, కేవలం ఓటరు మాత్రమే. రాజకీయ నాయకులు ఒకరినొకరు పాతాళానికి తొక్కె య్యడం వల్ల ఓటరుకు ఒరిగేదేముంది? ఒకరు మరొక నాయకుడిని ‘నీ అంతు చూస్తా’ అంటాడు. ప్రజాస్వామ్య పాలనలో ఎవరి అంతుచూడాలన్నది ‘ఓటరన్న’కే సాధ్యం అనే గ్రహింపు కలిగి ఉండాలి. ప్రజా సమస్యలను తుంగలో తొక్కేసి, పర నింద, పరుష నింద వల్ల ఒరిగేదేమిటో వారికే ఎరుక!మరో నాయకుడు ‘ప్రతి అవ్వకు, ప్రతి తాతకు’అంటూ బంధుత్వాన్ని కలుపుతారు. ఈ మాటలు ఆ నాయ కుడికీ, ఓటరుకీ మధ్య ఒక మనోబంధాన్ని ఏర్పరుస్తాయి. తద్వారా ప్రజలకు ఆ నాయకుడిపై ఒక నమ్మకం, ఒక భరోసా కలిగిస్తాయి.పార్టీ అజెండా ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థ మయ్యే విధంగా వివరించాలి. గతకాలంలో చేసిన వాగ్దా నాలు, వాటి నెరవేర్పు ఏమేరకు జరిగింది, వాటి మధ్య ఉన్న అంతరమెంత, ఆ అంతరాన్ని పూరించడానికి ఈ సారి అధికారంలోకొస్తే ఎలాంటి కార్యాచరణ చేస్తారు అనే అంశాలను విశదీకరించాలి. అంతే కాని, మన మాటలు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చేవిగా, లేదా ఇతరులను దిగ జార్చేదిగా ఉండకూడదు. మన నైతికత మనకు సిబిల్ స్కోర్ లాంటిది. అది ఎంత ఎక్కువైతే అంత లాభిస్తుంది. అది ఎంత తక్కువైతే అంత పరోక్ష నష్టం వాటిల్లుతుంది. ఇటీవల కాలంలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై, ఆయన ప్రత్యర్థులు అతనిని ‘హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన తమ ప్రతివాదులను తిరిగి ఒక్క పరుషమైన మాట మాట్లాడక పోవడం చూపరులను ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. ఇది ఆయన సంస్కార స్థాయిని వ్యక్త పరుస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినవారు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారు. రాజకీయ నాయకులు వాడే అవాంఛనీయ భాష పార్టీల మధ్య కంటే, సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సామా న్యుడు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అలాగే నాయకులు భాషను భ్రష్టు పట్టించకుండా ఉండాలి. అదే భాషా ప్రేమికుల ఆశ. మాతృ దేవోభవ, పితృ దేవో భవ అనే సంస్కృతిలో పుట్టి పెరిగిన మనం అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మన సంస్కారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.భాషను మనం సునిశితంగా పరిశీలించినట్లయితే, భాషలో పబ్లిక్ భాష, ప్రైవేట్ భాష, తక్కువ స్థాయి భాష, ఎక్కువ స్థాయి భాష, ప్రజాస్వామ్య భాష అనే రకాలు న్నాయి. ప్రజల్లో మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక భాష మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భాష అనేది రెండు అంచులు గల కత్తి లాంటిది. మనం మంచిగా భాషను వాడితే సత్ఫలితాలనిస్తుంది. లేదంటే దుష్ఫలితాల నిస్తుంది. నాయకులు తమ నాయకత్వాన్ని వర్ధిల్ల చేసు కోవాలంటే, మంచి ‘భాషా శైలి’ ముఖ్యం అనే అంశాన్ని గ్రహించాలి.డా‘‘ యు. ఝాన్సీ వ్యాసకర్త తెలుగు అధ్యాపకురాలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, నూజివీడు -
అట్టడుగు జనం అభివృద్ధి చెందేలా...
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పనులూ ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఫలితంగా అట్టడుగు జనం జీవన ప్రమాణాలు పెరుగుతూ పోతున్నాయి. అభివృద్ధికి నిజమైన నిర్వచనం ఇదే కదా! పారిశ్రామిక పార్కులు, పోర్టుల నిర్మాణం – అభివృద్ధి, విమానా శ్రయాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో ఏపీలో ఉద్యోగ కల్పన వేగం పుంజుకొంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాల్లో అధిక భాగం దక్కడం ఈ అభివృద్ధి నమూనా ప్రత్యే కతగా చెప్పుకోవాలి.ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక పార్కుల ప్రాంతాల్లో ఒకప్పుడు బతుకు తెరువు కోసం పట్నాలకు వలస పోయే పరిస్థితి ఉండేది. మిగిలిన వారు పెత్తందారుల చుట్టూ పని కోసం తిరిగే వారు. ప్రస్తుతం ఆ యా ప్రాంతాల్లో పరి శ్రమలు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.తిరుపతి జిల్లాలోని ‘శ్రీసిటీ పారిశ్రామిక పార్క్’ సమీపంలోని మల్లావారి పాలెం గ్రామస్థుడు సన్యాసయ్య చెప్పినట్లు ‘బడుగు జీవుల పొలాలకు మంచి ధరలు వచ్చాయి. ఇంటికో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరి ముందు తలవంచక ఆత్మ విశ్వాసంతో’ బతుకుతున్నారు.‘‘టెన్త్ మాత్రమే చదివిన నాకు ఎక్కడా పని దొరక లేదు. సెల్ఫోన్తో కాలక్షేపం చేస్తూ... కాలం వృధా చేస్తున్న సమయంలో, సెల్ఫోన్లు తయారీ కంపెనీలో పని దొరికింది. ఇంటి నుండి కంపెనీకి వెళ్లి రావడానికి బస్సౌకర్యం, క్యాంటీన్, 24 గంటల హెల్త్ సెంటర్ ఉంది’– తిరుపతికి చెందిన మరో యువతి మనోగతం ఇది. వీరంతా ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలకు చెందిన పేద మహిళలు.ఇక్కడ ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మహిళలే. టెన్త్ నుండి ఇంజనీరింగ్ వరకు చదివిన వారే. ఈ అవకాశం తైవాన్ బహుళజాతి సెల్ఫోన్ తయారీ సంస్థ ‘ఫాక్స్కాన్’ ద్వారా మహిళలకు దొరికింది. తిరుపతి జిల్లా శ్రీసీటీలో ఈ కంపెనీ 30 ఎకరాల్లో ఏర్పాటయింది. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దుల్లో, నెల్లూరు జిల్లా తడ, తిరుపతి జిల్లా సత్యవేడు మధ్య ఏర్పాటయ్యింది శ్రీసిటీ పారిశ్రామిక పార్క్. 2006లో ఇక్కడ భూసేకరణ సమయంలో అనేక ఆందోళనలు జరిగాయి. అప్పటి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులతో స్వయంగా సమావేశమై అప్పటి మార్కెట్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి 14 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. ఇది 2008లో ప్రారంభమై 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, ఓడరేవు అన్నీ దగ్గరగా ఉండడం ఈ పారిశ్రామిక పార్కుకి బాగా కలిసొచ్చింది.ఇందులో ఇప్పటి వరకు 220 కంపెనీలు ఏర్పాటై 62 వేల మందికి ఉపాధి కలిగింది. వారిలో సగం మంది మహిళలే. గత 55 నెలల్లో, రాష్ట్రంలో 311కి పైగా ప్రధాన పరిశ్రమలు స్థాపించారు. 1.3 లక్షల ఉద్యోగావకా శాలు ఉన్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ. 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల మరో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సీ పోర్టుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులకు తోడు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టి వాటిని అభివృద్ధి చేస్తోంది. దాదాపు రూ. 16,000 కోట్లతో రామా యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులను నిర్మిస్తున్నారు. కొత్త పోర్టుల వల్ల 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడరేవుల ద్వారా 75 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మత్స్యకారుల జీవనోపాధిని పెంచుతాయి. 3,793 కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ల్యాండింగ్ సెంటర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్ల తీరప్రాంతానికి ఓడరేవు లేదా ఫిషింగ్హార్బర్ ఉంటుంది. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమా నాశ్రయం రూ. 4,592 కోట్ల ప్రాజెక్ట్. దీనివల్ల 10,000 మందికి ప్రత్యక్షంగా, 80,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయి. గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్త రణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామ్కో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ) ఇండెక్స్లో వరుసగా మూడేళ్లుగా భారత్లో నంబర్వన్గా నిలవడం ఈ సందర్భంగా గమనార్హం.- వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్ మొబైల్: 94405 95858- శ్యాంమోహన్ -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
తప్పుడు ప్రకటనలకు విరుగుడు ఎలా?
తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి సంస్థ విషయంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. 1954 నాటి చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. అయినా ఫలానా ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలువలు పలువలుగా చెప్పడం కొనసాగుతూనే ఉంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం ఒక్క సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్సావిధానాలు, మందుల గురించి ప్రచారం జరుగుతోంది. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు; చట్టాల అమలులో ఉదాసీనంగా ఉండటమే అసలు సమస్య.సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఆసక్తికరమైన వ్యవహారం నడిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చారంటూ పతంజలి ఆయుర్వేద వ్యవస్థాప కుడు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేననీ, ధిక్కరణ కేసు విష యంలో క్షమాపణలు స్పష్టంగా, బహిరంగంగా తగు ప్రాధాన్యంతో చెప్పాల్సిందేననీ సుప్రీంకోర్టు పట్టుబట్టిన విషయం తెలిసిందే. తుది తీర్పు మాటెలా ఉన్నా... ఈ కేసు అటు మందుల తయారీదారుకు, ఇటు నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, వినియోగదారులకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకీ ఏమిటీ కేసు? అన్నింటికీ కేంద్రంగా ఉన్నవి 1954 నాటి డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల) చట్టం; 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం... దీని కింద 1945లో రూపొందించిన నిబంధనలను రామ్దేవ్ బాబాకు చెందిన సంస్థలు ఉల్లంఘించాయన్నది ఆరోపణ. 1954 చట్టం కొన్ని రకాల వ్యాధులకు మందులను ప్రకటించడంపై నిషేధం విధిస్తోంది. కొన్ని రకాల మందుల ప్రకటనకు సంబంధించి పరిమితులు విధిస్తోంది. క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, ఎయిడ్స్, ఊబకాయం, తక్కువ వయసు లోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం, అంధత్వం వంటి సమస్యల పరిష్కారానికి మందులున్నాయని ప్రకటనలు జారీ చేయకూడదు... ఔషధాలతో అద్భుతాలు జరుగుతాయనడం, వాటి సామర్థ్యంపై చిలు వలు పలువలుగా చెప్పడం వంటివి. 1940 నాటి చట్టం... భారత్లో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలు తదితరాల తయారీ, పంపిణీ, అమ్మకాలకు సంబంధించిన ప్రాథమిక చట్టం.పతంజలి సంస్థ మధుమేహం మొదలుకొని థైరాయిడ్ సంబంధిత సమస్యలు, ఆఖరికి క్యాన్సర్ వ్యాధికీ మూలిక సంబంధిత మందులు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ సంస్థ వ్యాధిని నయం చేస్తుందని చెబుతూ ‘కరోనిల్’ను ప్రవేశ పెట్టింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనికి మద్దతు పలికారు. ఈ మందుపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు మార్కెటింగ్లో ‘చికిత్స’ స్థానంలో ‘నిర్వహణ’ అని మార్చి చేతులు దులుపుకుంది పతంజలి. ఎన్నో వ్యాధులకు చికిత్స కల్పిస్తామని ప్రక టనలు జారీ చేయడమే కాకుండా, ఆధునిక వైద్య పద్ధతినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ అంశంపై విసుగు చెందిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. చట్టాల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. కోర్టు తగదని వారించినా తప్పుడు ప్రకటన జారీ మాత్రం ఆపలేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణకూ పాల్పడినట్లు అయ్యింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీ కేవలం పతంజలి సంస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నిర్దిష్ట సమయాల్లో దేశంలోనిపత్రికలు, న్యూస్ ఛానెళ్లు కూడా ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఎన్నో తప్పుడు చికిత్స పద్ధతులు, మందుల గురించి ప్రచారం చేస్తూంటాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనైతే ఇలాంటివి కుప్పలు తెప్పలు! తాజాగా సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లు’ రంగంలోకి దిగారు. ప్రమాదకరమైన ఉత్పత్తులను కూడా వీరు ఆరోగ్యం పేరిట అమ్మడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పెద్ద కంపెనీలు నేరుగా ప్రకటనలు జారీ చేసే విషయంలో కొంత నిగ్రహం పాటిస్తాయి. బదులుగా పెయిడ్ న్యూస్, వైద్య సంబంధిత సదస్సుల ప్రాయోజకత్వం, వైద్యులకు గిఫ్టులు ఇవ్వడం వంటి అనైతిక చర్యల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేస్తూంటాయి. కొన్నేళ్ల క్రితం తగినన్ని సాక్ష్యాలు లేకపోయినా కొన్ని ఔషధాల సామర్థ్యం విషయంలో ఐఎంఏ స్వయంగా మద్దతు పలకడం చెప్పుకోవాల్సిన అంశం. వైద్యుల అనైతిక చర్యల విషయంలోనూ ఐఎంఏ రికార్డు ఏమంత గొప్పగా లేదు. దేశంలోని చట్టాలు సరిపోకపోవడమో, శక్తిమంతంగా లేకపోవడమో ప్రస్తుత సమస్యకు కారణం కాదు. ప్రభుత్వాలు చట్టాలను అమలు చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూండటమే అసలు సమస్య. నియంత్రణ సంస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.హెచ్ఐవీ/ఎయిడ్స్కు చికిత్స కల్పిస్తామంటూ రామ్దేవ్ చేసిన ప్రకటనలను 2008లో నేను ఖండించాను. స్వయంగా వైద్యుడైన అన్బుమణి రామ్దాస్ నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రామ్దేవ్కు నోటీసు జారీ చేసింది. కొంత కాలం గడిచిందో లేదో... మంత్రి ‘యూ టర్న్’ తీసుకున్నారు. గురుగ్రామ్లో రామ్దేవ్ బాబాతో కలిసి యోగా సెషన్ లో కనిపించారు. ఆ వేదికపై కూడా రామ్దేవ్ హెచ్ఐవీ/ఎయిడ్స్ల చికిత్సకు తన మందులు ఉపయోగపడతాయని ప్రకటించుకున్నారు. దాదాపు ఈ సమయంలోనే సీపీఎం ఎంపీగా ఉన్న బృందా కారత్ ఈ రామ్దేవ్ వ్యవ హారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత కేసు సంగతికి వద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా ఉదాసీన వైఖరిని అవలంబించాయి. ఫలితంగా రామ్దేవ్ బాబా తన తప్పుడు ప్రకటనల జారీని యథేచ్ఛగా కొనసాగించగలిగారు. కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు డాక్టర్ కేవీ బాబు పతంజలి సంస్థపై వరుసగా ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఉత్తరాఖండ్లోని స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి పలుమార్లు లేఖలు రాశారు. దాంతో అధికారులు పతంజలి సంస్థ అలాంటి ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలని లేఖ రాశారు. అంతేగానీ, అధికారం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు. పైగా తప్పించుకునేందుకు మార్గమూ చూపించారు. 1954 చట్టం కింద కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్లోని నిర్దిష్ట నిబంధన కింద నోటీసు జారీ చేశారు. ఈ నిబంధనపై అప్పటికే ముంబై హైకోర్టులో ఓ కేసు నడుస్తూ ఉంది. దీంతో పతంజలి సంస్థ ఆ కేసును చూపి ప్రకటనల జారీ కొనసాగించింది. ప్రశ్నార్థకమైన ఈ నిబంధనను 2018లో ఒక సవరణ ద్వారా కలిపారు. ఆరోగ్య సంబంధిత ప్రకటనల జారీలో ముందస్తు అనుమతులను అది తప్పనిసరి చేసింది.ఆహార పదార్థాల ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనడం, వాటి గురించి ఊదరగొట్టడం కూడా ఒక సమస్య. ఇలాంటి కేసుల్లోనూ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ పనితీరును నత్తను తలపించేదే. న్యూట్రాస్యూ టికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో మారిపోతున్న మీడియా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుంటే... ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల (ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించినవి) సంపూర్ణ సమీక్ష అవసరం. మందులు, ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వంటి అన్ని అంశాలకు సంబంధించిన, భారతీయ వైద్య విధానానికి సంబంధించిన చట్టాలను కూడా పూర్తిగా సమీక్షించాలి. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ప్రస్తుతమున్న చట్టాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీల పని తీరునూ సమీక్షించాలి. తగినన్ని వనరులు, అధికారాలు సమ కూర్చడం, స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం ద్వారా పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యువనేత జైత్రయాత్ర!
పట్టుదల, దీక్షా దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్వి జయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువ నేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డప్పటికీ వెరవ లేదు. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం జగన్ తనయాత్ర కొనసాగించారు. తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసినా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసినా, ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినా, ఎన్నికల ప్రచారం కోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేసినా... వీటన్నింటిలోనూ ఒక ఆర్ధ్రత, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళ వింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అను భూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగ బోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుండి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరో పక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో బస్సు యాత్ర ఆపేందుకు కుటిల యత్నాలు చేశారు. ముఖ్య మంత్రిపై దాడిచేస్తే బస్సు యాత్రకు బ్రేక్ వేయవచ్చన్న దుర్బుద్ధితో వారు చేసిన ప్రయ త్నాలకు జగన్ వెరవలేదు. ఈ క్రమంలోనే దత్తపుత్రుడి చరిష్మా తగ్గిందని భావించిన పసుపు నేత చిరంజీవి అనే ముఖాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డారు.అన్నింటికంటే మిన్నగా బస్సుయాత్ర మొదలైనప్పటి నుండి వలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెర తీశారు. అయితే అదికాస్తా తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో పాలుబోని పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తూ వలంటీర్గా పనిచేస్తున్న గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ ప్రాణాలు తీసు కునేలా పచ్చ బ్యాచ్ బరితెగించింది. వలంటీర్ల వ్యవస్థ మీద చేయకూడని ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే తాము కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. మరో అడుగు ముందుకేసి వారి గౌరవ వేతనం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని ప్రజలు ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటు న్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్ర బాబు... తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పు డున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లిమ్ల రిజర్వేషన్పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుఃస్థితిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనక పోవడమూ గమనార్హం. ఇలా చెప్పు కుంటూ పోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి జిమ్మిక్కులూ, అబ ద్ధాలూ, కుయుక్తులూ, విషప్రచారాలూ చాలానే ఉన్నాయి.ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, చిత్తశుద్ధి – అంకిత భావంతో కూడిన రాజకీయాలు ఇంకోవైపు ఉన్నాయని సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారు. పేదలు – పెత్తందార్ల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోందని ప్రతిపక్ష కూటమి చర్యలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటివరకూ ప్రజలకోసం చేసిన పనులూ, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. అలా ఆయన ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూల మంత్రంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement