-
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్నెట్ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్బర్న్కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్బర్న్కు గురైన జామ కాయ, - సన్బర్న్కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్పై డ్రిప్తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement