మస్క్ సామ్రాజ్యానికి ‘అగ్నికుల్’ జర్క్
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో అంతరిక్షాన్ని ఆక్రమించాలని చూస్తున్న వేళ ఒక భారతీయ స్టార్టప్ ఆయన వ్యూహాలకు గట్టి జర్క్ ఇచి్చంది. ఖరీదైన శాటిలైట్లతో పనిలేకుండా వాడి పారేసే రాకెట్ వ్యర్థాలనే బంగారంగా మారుస్తూ అంతరిక్షంలో ఏఐ క్లౌడ్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు చెన్నైకి చెందిన ‘అగ్నికుల్ కాస్మోస్’సిద్ధమైంది. 2026 ఏడాది చివరి నాటికి జరగనున్న ఈ ప్రయోగం ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ఆధిపత్యానికి గట్టి సవాల్ విసురుతోంది.
మస్క్ వర్సెస్ అగ్నికుల్..
ఎలాన్ మస్క్ ఇప్పటికే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ)లో ఒక దరఖాస్తు సమరి్పంచారు. ఏకంగా 10 లక్షల కంప్యూటింగ్ శాటిలైట్లను ప్రయోగించి, నింగిలో ఒక ‘సూపర్ కంప్యూటర్ నెట్వర్క్’నిర్మించాలనేది మస్క్ మహా ఆలోచన. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి, భారీగా ఇంధనం ఖర్చు అవుతుంది. కానీ, అగ్నికుల్ తన పేటెంట్ టెక్నాలజీ ‘సూరజ్’ద్వారా ఒక అద్భుతం చేస్తోంది. రాకెట్ తన లక్ష్యాన్ని చేరాక మిగిలిపోయే పైభాగాన్ని పారేయకుండా, దాన్నే ఒక శక్తివంతమైన ఏఐ డేటా సెంటర్గా మారుస్తోంది. మస్క్ కొత్త ఇల్లు కడుతుంటే, అగి్నకుల్ పాత ఇటుకలతోనే రాజప్రసాదం కడుతున్నట్టుగా ఈ ‘జర్క్’టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
అంతరిక్షమే ఎందుకంటే?
భూమిపై డేటా సెంటర్లు నడపాలంటే కోట్ల లీటర్ల నీరు, నిరంతరాయంగా అత్యధిక స్థాయిలో విద్యుత్ అవసరం. పైగా పవర్ గ్రిడ్ విఫలమైతే, ఇక్కడి సెంటర్లు కేవలం 72 గంటల వరకు మాత్రమే బ్యాకప్తో నడవగలవు. అదే అంతరిక్షంలో అయితే సూర్యుని నుంచి అంతులేని సౌరశక్తి నిరంతరం లభిస్తుంది. సెమీకండక్టర్ వ్యవస్థలను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా నీరు అక్కర్లేదు. అంతరిక్షంలోని శూన్యమే వాటిని చల్లబరుస్తుంది. అత్యంత తక్కువ ఖర్చులో మన అగి్నకుల్ ఈ అవసరాలు తీర్చనుంది.
విశ్వ యుద్ధంలో సరికొత్త ఆర్కిటెక్ట్!
చైనా ఇప్పటికే 2,00,000 శాటిలైట్లను ప్రయోగించాలని తలపోస్తోంది. ఎన్విడియా మద్దతున్న స్టార్క్లౌడ్ కూడా రేసులో ఉంది. కానీ భారత్ చూపుతున్న ‘పునర్వినియోగ’వ్యూహం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది. నిన్నటి వరకు విదేశీ శాటిలైట్లను మోసుకెళ్లే ‘లారీ డ్రైవర్’లాంటి స్థాయి నుంచి నేడు అంతరిక్షంలో మేధో సంపత్తిని నిర్మించే ‘ఆర్కిటెక్ట్’స్థాయికి భారత్ ఎదిగింది. తాజాగా కేంద్ర బడ్జెట్–2026లో ప్రకటించిన ప్రోత్సాహకాలతో 2027 నాటికి భారత్ తన మొదటి అంతరిక్ష ఏఐ సేవలను ప్రపంచానికి అందించనుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


