
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.
అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది.
రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.
అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
ల్యాండ్ పూలింగ్కు
రాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.
రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్ర
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.

మండిపడుతున్న అమరావతి రైతులు
ఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.