పరీక్ష ఫీజు వసూలుపై వివరణ ఇవ్వండి | Give details on examination fee collection | Sakshi
Sakshi News home page

పరీక్ష ఫీజు వసూలుపై వివరణ ఇవ్వండి

Jan 5 2024 3:35 AM | Updated on Jan 5 2024 8:01 AM

Give details on examination fee collection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి వెలువరించిన నోటిఫికేషన్‌లో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వర్గాలకు పరీక్ష ఫీజు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. 2023, నవంబర్‌ 25న అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజుగా రూ.450ని నిర్థారించింది.

అయితే ఈ నోటిఫికేషన్‌లో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ జె.విప్లవ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. 1985, జూలై 1 నాటి నోటిఫికేషన్‌ ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష/ఎంపిక కోసం పరీక్ష రుసుము చెల్లించకుండా మినహాయించారని పిటిషనర్‌ వాదించారు.

ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు తాజా రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement