బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్ల్లో భారత-ఏ జట్టు నేపాల్పై.. పాకిస్తాన్-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్ ఫోర్లోకి ప్రవేశించాయి. సెమీస్లో భారత్, పాక్ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్లాండ్ మ్యాచ్లతో తెలుస్తుంది.
ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాక్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్లో యూఏఈ.. భారత్, పాక్కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్, పాక్తో సమానంగా మూడింట రెండు మ్యాచ్లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో మరో జట్టు నేపాల్, ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది.
గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఏ సెమీస్ బెర్త్ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్ ఫలితం డిసైడ్ చేస్తుంది.
గ్రూప్-బిలో మరో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో మలేషియా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.
ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్లో భారత్, పాక్ పోటీపడతాయి. సెమీస్లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరుగనుంది.
నేపాల్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్ 4, మిన్నూ మణి 3, కెప్టెన్ రాధా యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్లో సమ్జానా ఖడ్కా (22) టాప్ స్కోరర్గా నిలిచింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది.
మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని పాక్ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.


