నోటాకు 1,362
నో రిజెక్ట్.. నో నోటా
చెల్లని ఓట్లు 3,936..
● ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ తీరు
● 59 వార్డుల్లో నోటాకు జీరో
● 5 వార్డుల్లో నో రిజెక్ట్
సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,936 ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్పై ఎక్కువ చోట్ల ముద్ర వేయడం, పెన్ను లు, ఇతర మార్కర్లతో రాయడం, అసలు ఓటు ముద్ర వేయకుండా ఖాళీగా ఉంచడం వంటి కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పాటు 1,362 మంది నోటాకు ఓటు వేశారు. పలు చోట్ల ఓట్లు తిరస్కరణ, నోటాకు ఓటు వేయడంతో అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయి. ఉదాహరణకు దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులో 1,076 ఓట్లుండగా 945 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వార్డులో బీఆర్ఎస్, బీజేపీలకు 266 చొప్పున ఓట్లు వచ్చాయి. 9 ఓట్లు తిరస్కరణ, ఒక ఓటు నోటాకు వేశారు. డ్రా తీయడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లవ్వ విజయం సాధించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3,936 ఓట్లు తిరస్కరణకు గురికాగా 1,362 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఈవీఎం ద్వారా ఎన్నికల నిర్వహణ జరిగితే ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఓట్లు తిరుస్కరణకు గురయ్యాయి. బ్యాలెట్లో అభ్యర్థికి సంబంధించిన గుర్తును సరిగా ఎంపిక చేసుకుని ఓటు వేయడంలో చాలా మంది పొరపాట్లు చేశారు. స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన వారు చెల్లని ఓట్లతో ఆ ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2014 నుంచి నోటాకు అవకాశం
2014లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. 2013లో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి ఓటింగ్కు దూరంగా ఉన్న వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించి పోలింగ్ శాతం పెంచేందుకు నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకవచ్చింది. పోటీలో ఉన్న వారు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించారు.
పలు చోట్ల ఓటు హక్కును అవగాహనతో వినియోగించుకోవడంతో ఓట్లు తిరస్కరణకు గురికాలేదు. ఉమ్మడి జిల్లాలో 5 వార్డుల్లో ఒక్క ఓటు సైతం రిజెక్ట్ కాలేదు. అలాగే 59 వార్డుల్లో ఒక్కరు సైతం నోటాకు ఓటు వేయలేదు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఓట్లలో ఒక్కటీ రిజెక్ట్ కాలేదు. అలాగే నోటాకు ఓటు వేయలేదు. జహీరాబాద్ 6వ వార్డు పరిధిలో సైతం ఒక్క ఓటు రిజెక్ట్ కాలేదు, నోటాకు వేయలేదు.


