పట్టణ ప్రగతికే ప్రాధాన్యం
‘సాక్షి’తో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి
హుస్నాబాద్: కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల సహకారంతో మౌలిక వసతుల కల్పన, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటాల్లోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను గెలిపించారు. పట్టణంలో ఉన్న 20 వార్డుల్లో రాజకీయాలకు అతీతంగా సమానస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచనలేకుండా కృషిచేస్తా. శానిటేషన్, తాగునీరు. స్ట్రీట్ లైట్లు. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తా. ముఖ్యంగా కోతుల బెడద నుంచి ప్రజలను విముక్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. మున్సిపల్కు వచ్చే నిధులతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా అదనపు నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతీ సమస్య పరిష్కరిస్తా.
మున్సిపల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికై న దండి లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి బయటకు రాగానే భర్త దండి కొమురయ్య కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. 2004లో కౌన్సిలర్గా ఎన్నికై న దండి లక్ష్మి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. రెండో సారి లక్ష్మిని అదృష్టం వరించింది. రెండో ప్రయత్నంలో మున్సిపల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


