చెరువును సుందరీకరిస్తాం
కోహెడరూరల్(హుస్నాబాద్): త్వరలోనే కోహెడలోని బడుగుల చెరువును సుందరీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కోహెడ పర్యటనలో భాగంగా ఆయన చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. చెరువు భూములకు పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. కోహెడ అభివృద్ధిలోనే ప్రథమ స్థానం ఉంటుందన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ టీస్టాల్ వద్ద ఆగారు. టీతాగుతూ యువకులతో ముచ్చటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నంగునూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెటీరో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి తెలిపారు. టెన్త్లో 60 శాతం, ఇంటర్మీడియెట్లో 55 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే మేళాకు ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ, ఫార్మా, బ్రిడ్జ్ కోర్స్ చేసిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. టెన్త్, ఇంటర్ మెమోలు, ఒరిజినల్ ఆధార్కార్డు తోపాటు రెండు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించి నెలకు రూ.12,500 చెల్లిస్తారని చెప్పారు.
24న చలో సెక్రటేరియట్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట చలో సెక్రటేరియట్కు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మౌలానా, మల్లేశం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
రామకోటి రామరాజు
దుబ్బాకటౌన్: గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ వైభవాన్ని భక్తులకు చాటిచెప్పడానికి కృషి చేస్తానని శ్రీరామకోటి భక్త సమాజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు చెప్పారు. మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన 500 యేళ్లనాటి భ్రమరాంబ మల్లికార్జునుడి ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ చుట్టూ పొలాలు, మధ్యలో ఆలయం ఎంతో ఆహ్లదకరంగా ఉందన్నారు. అనంతరం ఆలయ బాధ్యులు ఆయనను సత్కరించారు.
చెరువును సుందరీకరిస్తాం


