విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు
ప్రత్తిపాడు: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ సీహెచ్.రమేష్ హెచ్చరించారు. పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు, అన్నవరం, కాట్రపాడు, పాలపర్రు, పుసులూరు, రాజుపాలెం, రావిపాడు, ఉప్పలపాడు, వరగాని గ్రామాల్లో గురువారం విద్యుత్ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఈ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 40 మంది అధికారులు, 120 మంది సిబ్బంది, 40 బృందాలుగా ఏర్పడి 3,010 సర్వీసులను తనిఖీ చేశారు. అనంతరం పెదనందిపాడు విద్యుత్ సబ్ స్టేషనులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఈ తనిఖీల వివరాలను వెల్లడించారు. మీటరు ఉన్నప్పటికీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.40 వేలు, అనుమతించిన లోడుకంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 84 మందికి రూ.3.06 లక్షలు, వినియోగం కంటే బిల్లు తక్కువగా వచ్చిన ఒకరికి రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.3.51 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యానికి సంబంధించిన పూర్తి వివరాలను 9440812263, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో ఈఈలు ఎఏ.కరీమ్, ఏ.సత్యనారాయణ, డీఈఈలు ఏ.వెంకటేశ్వరరావు, ఎన్.మల్లికార్జునప్రసాద్, ఏఈలు డి.మురళీకృష్ణ, యూ.శివశంకర్, ఎం.సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


