అంబటిపై దాడి ఆటవికం
●మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
● గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పరామర్శ
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై దాడి ఆటవిక, అరాచక చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
● రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయిందన్నారు. అంబటి నివాసంపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని మండిపడ్డారు.
● లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేసింది కూటమి నేతలేనని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేస్తోంది వారేనన్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
● జోగి రమేష్ ఇంటిపై ప్రణాళికాబద్ధంగా దాడి చేశారని, పరిపాలన ఎలా ఉందో సరిచూసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వనికి ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఇది రాచరిక రాజ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలని, ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.
● వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పులపై మీరు అబద్ధాలు చెప్పలేదా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేసింది కూటమి నేతలు కాదా అని దుయ్యబట్టారు. దివిసీమ ఉప్పెన తరహాలో ప్రజా ఉప్పెనలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. రైతులు, విద్యార్థులు, ఆరోగ్య శ్రీ, పేదలకు మూడు సెంట్ల స్థలాలు ఇవ్వడం గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
● చంద్రబాబు బిల్గేట్స్ను తీసుకొచ్చి షో చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
● అంబటిని పోలీస్ స్టేషన్ లో శారీరకంగా హింసించారని, దాడికి పాల్పడిన వారిని వదిలేసి... దాడికి గురైనవారిని జైలులో పెట్టే వింత పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.
● అంబటి కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ ఉందని, అన్ని కులాలు ఏకమై చంద్రబాబు ప్రభు త్వాన్ని గద్దె దింపే వరకు పోరాడుతామన్నారు.
● ముందుగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కాపు, బీసీ సంఘాల నేతలు ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అంబటి కుమార్తె మౌనిక, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, నగర అధ్యక్షుడు మహేష్, బీసీ విభాగం నేతలు అవినాష్, రవి, ఏటి కోటేశ్వరరావు, పలు అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.


