బంగారం దిగుమతులు 349% అప్
ఎగుమతులు 36.56 బిలియన్ డాలర్లు
పసిడి, వెండి దిగుమతులు దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. జనవరిలో వస్తు ఎగుమతులు 0.61 శాతం పుంజుకుని 36.56 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ, దిగుమతులు 19.2 శాతం ఎగసి 71.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం, వెండి దిగుమతులు గణనీయంగా పెరగడమే ఈ పరిస్థితికి కారణం. ఫలితంగా వాణిజ్య లోటు మూడు నెలల గరిష్ట స్థాయిలో 34.68 బిలియన్ డాలర్లకు చేరింది. టారిఫ్ల కారణంగా జనవరిలో అమెరికాకు మన దేశ వస్తు ఎగుమతులు తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలి్చతే 21.77 శాతం తగ్గి 6.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
బంగారం దిగుమతులు జనవరిలో 349 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుకాగా, వెండి దిగుమతులు సైతం 127 శాతం జంప్చేసి 2 బిలియన్ డాలర్లకు చేరాయి.
చమురు దిగుమతులు మాత్రం 0.24 శాతం తగ్గి 13.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ప్రస్తుత ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి జనవరి వరకు వస్తు ఎగుమతులు 2.22 శాతం పెరిగి 366.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కాలంలో దిగుమతులు 7 శాతానికి పైగా పెరిగి 649.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు మొదటి పది నెలల్లో 247.38 బిలియన్ డాలర్లకు చేరింది.
జనవరిలో సేవల ఎగుమతులు 43.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2025 జనవరిలో ఇవి 34.75 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. సేవల దిగుమతులు 19.60 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి.
ఏప్రిల్–జనవరి మధ్య వస్తు, సేవల ఎగుమతులు కలసి 720.76 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 679 బిలియన్ డాలర్లు.


