జనవరిలో 1.81 శాతానికి చేరిన టోకు ధరల ద్రవ్యోల్బణం
కేవలం నెల వ్యవధిలోనే రెట్టింపు స్థాయికి చేరిన సూచీ
భగ్గుమన్న లోహాలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తుల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81 శాతానికి ఎగబాకింది. డిసెంబర్ 2025లో ఇది కేవలం 0.83 శాతంగా ఉండగా.. ఒక్క నెల వ్యవధిలోనే 1%‡ పెరగడం గమనార్హం.
నవంబర్లో మైనస్లో ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది.
ఎందుకింతలా పెరిగింది?
ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోలి్చతే ఈసారి ’బేసిక్ మెటల్స్’ (లోహాలు), టెక్స్టైల్స్ (వ్రస్తాలు), రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో, అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశముంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగసింది.
రంగాలవారీగా పరిస్థితి ఇలా..
టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86 శాతానికి చేరింది. ప్రధానంగా లోహాలు, వ్రస్తాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువులు విభాగంలో ద్రవ్యోల్బణం 2.21 శాతంగా నమోదైంది. డిసెంబర్తో పోలి్చతే (3.12%) ఇది కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి.
సామాన్యుడికి నేరుగా సంబంధమున్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో సున్నా (0.00%) వద్ద ఉండగా, జనవరి నాటికి 1.41 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విద్యుత్ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచి్చంది. ఇందులో ద్రవ్యోల్బణం –4.01 శాతం (మైనస్)గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు.
గత మూడు నెలల ట్రెండ్..
టోకు ధరల సూచీ గమనాన్ని గమనిస్తే.. స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది.
నవంబర్ 2025: –0.13% (ధరల తగ్గుదల)
డిసెంబర్ 2025: 0.83% (స్వల్ప పెరుగుదల)
జనవరి 2026: 1.81% (భారీ పెరుగుదల)
నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్ రేటును –0.13 శాతంగా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు.


