బోయకొండ పైకి వాహనాలు రయ్ రయ్
● భక్తులపై దాడికి యత్నిస్తున్న డ్రైవర్లు
● ప్రమాదాలు జరిగితే కానీ
పట్టించుకోరా?
చౌడేపల్లె : బోయకొండపై వెలసిన గంగమ్మ అమ్మవారి ఆలయం వద్దకు వాహనాలు రయ్ రయ్మని పోతున్నా.. పోలీసులు, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. సెలవులు, పండుగ రోజుల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తుంటారు. బోయకొండ గంగాపురం నుంచి బోయకొండపై ఆలయం వద్దకు యాత్రికులను అద్దె సుమో వాహనాల్లో టికెట్టు వసూలు చేసి తరలిస్తుంటారు. కొండపై ఏటవాలుగా ఉన్న ఘాట్ రోడ్డులో వాహనాల్లో పరిమితికి మించి యాత్రికులకు తరలించడం, అధిక వేగంగా వవెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్గంలోని రణభేరి గంగమ్మ ఆలయం సమీపంలో ఏటవాలు రోడ్డుపై సుమోలు ఒకదానికి ఒకటి పొటీ పడి వెళ్తుండటంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమోలు వేగంగా, ప్రమాదకర పరిస్థితిలో వెళ్తుండటంతో నడిచి వెళ్తున్న భక్తులు హడలి పోతున్నారు. ఇటీవల బోయకొండ ఆలయం వద్దకు మదనపల్లెకు చెందిన ఓ కుటుంబం వచ్చింది. వారు ఉన్న బైక్ వద్దకు డ్రైవర్ సుమోను వేగంగా తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారిపై డ్రైవర్ దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొండపై ఆలయం వద్దకు ఆటోలు నిషేధించినా భక్తులను తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. వారం క్రితం బోయకొండ దర్శనం చేసుకొని ఆటోలో కిందకు వస్తున్న ఆటో అదుపు తప్పి 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.


